సుమలతపై 16న రాళ్ల దాడి: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారస్వామి.. సినీనటి, మండ్య స్వతంత్ర అభ్యర్ధి సుమలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారస్వామి.. సినీనటి, మండ్య స్వతంత్ర అభ్యర్ధి సుమలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 16న సుమలత రాళ్ల దెబ్బల కారణంగా తలకు కట్టు కట్టించుకుంటారని... ప్రణాళిక ప్రకారం ఇలాంటి నాటకాన్ని ఆడబోతున్నారన్నారు. తన కార్యకర్తలతోనే సుమలత రాళ్లతో కొట్టించుకుని సానుభూతి కోసం ప్రణాళికలు రూపొందించారని కుమారస్వామి ఆరోపించారు.
రెండు పూటలా తిండి కోసమే దేశంలో యువత సైన్యంలో చేరుతోందంటూ మరో కలకలం రేపారు. భుక్తి కోసం సైన్యంలో చేరే యోధుల జీవితాలతో ప్రధాని చెలగాటం ఆడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు.
దీనిపై బీజేపీ మండిపడింది. దేశభక్తితో యువత సైన్యంలో చేరుతుంది తప్పించి పొట్ట కూటి కోసం కాదంటూ ట్వీట్ చేసింది. అలాగే మీ కుమారుడిని లోక్సభ ఎన్నికల్లో పోటీకి బదులు సైన్యంలో ఎందుకు చేర్పించలేదంటూ ప్రశ్నించింది.
మరోవైపు తనపై సీఎం చేసిన వ్యాఖ్యలపై సుమలత స్పందించారు. ముఖ్యమంత్రి తమపై దాడికి కుట్ర పన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగే సమయం, తేదీ సమయం చెప్పడం చూస్తుంటే దాడి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సుమలత అభిప్రాయపడ్డారు.