మా ఎమ్మెల్యేలను కొనలేరు... కేజ్రీవాల్
తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనడం అంత సులువు కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనడం అంత సులువు కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. 14మంది ఆప్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని.. త్వరలోనే బీజేపీలో చేరతారంటూ ఇటీవల కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించారు. కాగా... ఆయన కామెంట్స్ కి కేజ్రీవాల్ తాజాగా స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది? మీరు ఎంత ఇస్తున్నారు? మా ఎమ్మెల్యేలు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అని గోయల్ను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆయా రాష్ర్టాల్లో మీ వ్యతిరేక పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఆయా రాష్ర్ట ప్రభుత్వాలను కూలదోయడమే మీ లక్ష్యమా? అని మోదీని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే అర్థం ఇదేనా? ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అని కేజ్రీవాల్ ప్రశ్నల వర్షం కురిపించారు.
చాలాసార్లు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ.. అది అంత సులభం కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది.