ఎన్నికల బరిలో భార్య బాధితుల సంఘం అధ్యక్షుడు
అఖిల భారత భార్య బాధితుల సంఘం అధ్యక్షుడు దశరథ్ దేవడా ఎన్నికల బరిలో నిలుచున్నారు. త్వరలో జరగనున్న అహ్మదాబాద్ తూర్పు లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అఖిల భారత భార్య బాధితుల సంఘం అధ్యక్షుడు దశరథ్ దేవడా ఎన్నికల బరిలో నిలుచున్నారు. త్వరలో జరగనున్న అహ్మదాబాద్ తూర్పు లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ఎన్నిక కోసం ఆయన నామినేషన్ కూడా వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే.. భార్య బాధితుల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తానని చెప్పారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 498ను కొందరు మహిళలు దుర్వినియోగం చేయడాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
పురుషుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేస్తా అన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తన వద్ద డబ్బులు లేవని చెప్పిన దశరథ్.. ఇంటింటికీ వెళ్లి ఓటు వేయమని అభ్యర్థిస్తానని తెలిపారు.
దశరథ్ దేవడా ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడో సారి. 2014 లోక్సభ ఎన్నికల్లో, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. 2014 లోక్ ఎన్నికల్లో ఆయనకు 2,300 ఓట్లు పోలవగా, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 400 ఓట్లు పోలయ్యాయి. అఖిల భారత భార్య బాధితుల సంఘంలో మొత్తం 69,000 మంది రిజిస్టరై ఉన్నారు.