మిత్రులు లేకుంటే బీజేపీకి కష్టమే: గెలుపుపై రామ్మాధవ్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... తామంతట తామే 271 సీట్లు పొందగలిగితే, చాలా సంతోషమన్నారు
ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... తామంతట తామే 271 సీట్లు పొందగలిగితే, చాలా సంతోషమన్నారు.
ఎన్డీఏ పక్షాలతో కలుపుకుంటే మాత్రం బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని రాంమాధవ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులుగా మేం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. 2014లో మేం సాధించన దానిని ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆ మేజిక్ రిపీట్ కాకపోవచ్చునని వ్యాఖ్యానించారు.
2014లో భారీగా సీట్లు సాధించిన రాష్ట్రాల్లో ఈసారి వచ్చే నష్టాన్ని.. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో వచ్చే సీట్లతో పూడ్చుకుంటామని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.
తూర్పు భారతంలో బాగానే విస్తరించామని.. అదే స్థాయిలో దక్షిణ భారతదేశంలో కూడా కృషి చేసి వుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సారి అధికారంలోకి వస్తే అభివృద్ధి అనుకూల విధానాలను అనుసరిస్తామని తెలిపారు. అయితే తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందంటూ రామ్ మాధవ్ వ్యాఖ్యానించడం బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.