ఓపీనియన్ పోల్సీ: తగ్గుతున్న బీజేపీ గ్రాఫ్
2015 ఆగష్టు నుండి ఈ ఏడాది జనవరి మాసం వరకు ఓ సర్వే సంస్థ ఫలితాల మేరకు బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్నట్టు కన్పిస్తోంది.
న్యూఢిల్లీ: 2015 ఆగష్టు నుండి ఈ ఏడాది జనవరి మాసం వరకు ఓ సర్వే సంస్థ ఫలితాల మేరకు బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్నట్టు కన్పిస్తోంది. అదే సమయంలో ఏ పార్టీకి కూడ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాదని ఈ సర్వే చెబుతోంది.
2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 ఎంపీ సీట్లు దక్కాయి. కనీస మెజారిటీ కంటే ఎన్డీఏ కూటమికి 64 ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చాయి. యూపీఏకు 60, ఇతరులకు 113 ఎంపీ సీట్లు దక్కాయి.
2014లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
2015 ఆగష్టు మాసంలో ఇండియా టూడే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్డీఏకు 288, యూపీఏకు 81, ఇతరులకు 174 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది. కనీస మెజారిటీ కంటే 16 సీట్లు అదనంగా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.
2016 ఫిబ్రవరిలో మరోసారి ఇదే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్డీఏకు 286 ఎంపీ సీట్లు, యూపీఏకు 110, ఇతరులకు 147 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. కనీస మెజారిటీ కంటే 14 సీట్లు ఎక్కువగా ఎన్డీఏకు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.
2018 జనవరి మాసంలో మరోసారి సర్వే నిర్వహిస్తే ఎన్డీఏకు 309 , యూపీఏకు 102, ఇతరులకు132 ఎంపీ సీట్లు దక్కనున్నాయని సర్వే తేల్చింది. కనీస మెజారిటీ కంటే 37 ఎంపీ సీట్లు అదనంగా ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేను చూస్తే తెలుస్తోంది.
2018 ఆగష్టు మాసంలో ఇండియాటూడే సంస్థ, కార్వీతో కలిసి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్డీఏకు 281, యూపీఏకు 122, ఇతరులకు 140 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని తేల్చింది. కనీస మెజారిటీకి 9 సీట్లు ఎక్కువగా ఎన్డీఏకు దక్కే అవకాశం ఉందని ఈ సర్వేను బట్టి తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరి మాసంలో మరోసారి ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్డీఏకు 237, యూపీఏకు 166, ఇతరులకు 140 సీట్లు వస్తాయని తేల్చింది. హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేను బట్టి తెలుస్తోంది.
ఏబీపీ-సీ ఓటర్, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ నౌ -వీఎంఆర్ , వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేల్లో కూడ హంగ్ పార్లమెంట్ ఫలితాలు వచ్చాయి. అయితే పూల్వామా, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మార్పు ఏ మేరకు ఎవరికీ కలిసి రానుందో అనే అంశం త్వరలోనే ఓటర్లు తేల్చనున్నారు.