Asianet News TeluguAsianet News Telugu

పుస్తక సమీక్ష: బహుజనుల బతుకుగోస 'ఆళ్లకోస'

యోచన రాసిన ఆళ్ల కోస కవిత్వాన్ని ముఖేష్ సామల సమీక్షించారు. ఆళ్లకోస కవిత్వంలోని సామాజిక ప్రయోజనాన్ని, అందులోని తెలుగు సాహిత్యం విలువలను ఆయన స్పృశించారు.

Book Review: Samala Mukhesh reviews Yochana poetry Alla Kosa
Author
Warangal, First Published Jan 11, 2020, 4:22 PM IST

గాయపడ్డ హృదయాలే గేయాలను లిఖిస్తాయి, హేయాలను ఎదుర్కుంటూ....' అన్నట్లుగా యోచన రాసిన 'ఆళ్లకోస' ను చదివితే తన అంతరార్థం, తాత్వికత రచనలోని ఆర్ధత అర్ధమవుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకాలోని మారుమూల పల్లె మాదన్నపేట లో పుట్టిన మట్టిపరిమళం మన యోచన.తన తండ్రి బ్రహాం స్వయానా కవి, గాయకుడు.తెలంగాణ తొలి దశ ఉద్యమానికి తన పాటలతో ఊతమిస్తే,తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మలి దశ తెలంగాణ  పోరాటంలో కొడుకు యోచన తన కలాన్ని, గళాన్ని జులిపించాడు. తెలంగాణ ఉద్యమంలో 'నెనుసైతం' అంటూ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జరిగిన 'ధూమ్ ధామ్' వేదికలపై కుటుంబ భాద్యతలను మరిచి సంచార భైరాగియై తెలంగాణ గల్లీ గల్లీ, పల్లె పల్లె కలియ తిరిగి ప్రజలకు ఉద్యమ ఆకాంక్షను తన పాటలతో తెలియచెప్పిన నిబద్ధత కల్గిన ఉద్యమకారుడు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ప్రాణమైన తన పాటను తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఏ ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని చేపట్టినా సైనికుడి వలే ప్రభుత్వ విధానాలను, మిషిన్ భగీరథ,మిషిన్ కాకతీయ, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, కళ్యాణ లక్ష్మీ,ఆసరా పెన్షన్లు, వంటి విన్నూతనమైన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ, అవగాహన పెంచుతూ ఆకలి బాధలు లేని సమాజంకై పరితపించి బంగారు తెలంగాణ ఏర్పాటు లో క్రియాశీలకంగా, చురుకుగా పాల్గొంటున్న యువకవి యోచన.

కాకికి పర్యాయ పదం 'ఆళ్లకోస'. ఆళ్లకోస అనే పదాన్ని పుస్తకానికి టైటిల్ పెట్టడంలో అతని సృజనాత్మకత,కవితాత్మకత మనకు తెలుస్తుంది.మాములు పుస్తకాన్ని చదివినట్టు చదువుకుంటూ వెళ్తే సరిపోదు, తాను ఆవిష్కరించిన తత్వాన్ని తెలుసుకోవడానికి లోతైన విశ్లేషణ పాఠకుడికి అవసరం. యోచన గొప్పతనం ఏంటంటే కవులు  ఏదో ఒక వాదాన్ని తగిలించుకుని ఆ ఒక్కదానికి పరిమితం అవుతారు, కానీ ఇతను ఎల్లలు లేని కవీంద్రుడు స్త్రీలు, దళితులు, బీసీలు, ట్రైబల్స్, అడవి బిడ్డలు, వీరులు, యోధులు, అమరులు, విప్లవకారుల తో పాటు సమకాలీన అంశాలకు వెంటనే స్పందించి అప్పటికప్పుడు కై గట్టి పాట రాసి పాడగల నేర్పరి. బహుజనుల బాధలను కష్టాలను, కన్నీళ్లను,అవమానాలను, అణిచివేతలను తానే స్వయంగా 'కాకి' అవతారమెత్తికలవరపడుతూ లోకమంతా కలియతిరిగుతూ బహుజనుల ఐక్యతను తన భుజాన వేసుకుని సబ్బండ జాతులను సంఘటిత పరచడానికి తాను గొంతెత్తి పాడుతూ జాతిని జాగురుత పరుస్తాడు. మార్క్స్ వాదాన్ని, అంబేద్కర్ నినాదాన్ని తన పాటతో ప్రజలకు చేరువ చేస్తాడు.

Also Read: దాసరి మోహన్ దండెంపై సమీక్ష: ఆరేసిన విలువలు

కాకి(ఆళ్లకోస) గేయంలో 'ఎగిరే పక్షుల్లో దళిత జాతి నిదమ్మా' అన్నప్పుడు శ్రోత మొఖం ప్రశ్నార్ధకమై దానిలో తాత్వికత ను తెలుసుకునేందుకు ఆలోచనలో పడతాడు. జాతి భేదాలు మనుషుల్లో మాత్రమే కానీ, మిగితా జంతువుల్లో ఉండదు కదా..! మరి కేవలం మనమే ఈ వివక్షను ఎందుకు చూపిస్తాం?అని మనకుమనమే ప్రశ్నించుకునేలా చేస్తాడు. ఇంతటి ఆలోచనలు రేపే రచనా శైలి వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి, అన్నమయ్య లాంటి వారి తర్వాత మనం యోచన రచనల్లో గమనించవచ్చు. 'గొంతెండి పోయేదాక గోల బెడుతుంటావు/వచ్చేవాళ్లకెదురు జూసేలా జేస్తావు' అనే వ్యాఖ్యల్లో మన చిన్నతనపు బాల్యాన్ని గుర్తుచేస్తాడు, కాకులు పొద్దుగాల ఇంటి ముందలి సూరు కాడ అరుస్తుంటే ఇయ్యాల ఇంటికి సుట్టాల మతులవు చెప్పే, వీరబ్రహ్మం గారి లాగా కాలజ్ఞానం చెప్పగల సమర్ధజీవి అంటాడు. 'పితృదేవుళ్లకు బెట్టు పిండాలను ముట్ట/దండాలు బెట్టగా దండుతో వస్తావు/తల్లిదండ్రులాత్మల్ని తనువుగా జేసుకొని/కొండంత బలగంలో పిండాలు ముడ్తవు' అంటూ అన్ని సమయాల్లో కాకిగోల అని ఈసాడించుకునే జనాలు పిండం పెడుతూ దండమెట్ల పెడతారని, అది అంటరానిదెట్లయితదని యావత్ సమాజాన్ని ప్రశ్నిస్తాడు.'డప్పు' పాటలో 'డప్పునోయమ్మ నేను దరువునోయమ్మ/కడుపులోన పేగు కదిలి ఉరుముతున్న బరువునోయమ్మ'అంటూ మారుతున్న కాలంలో డప్పు ఉనికి కోల్పోతున్న తీరుకు బాధపడుతాడు.

'యుద్ధంలో పోరాడి శత్రువును ఒడిస్తే/ఆ శత్రువు గుండెల్లో దడిసప్పుడవుతాను' అనే వ్యాఖ్యల్లో ఏ ఉద్యమానికైనా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో డప్పు దరువు లేని వేదికను మనం ఉహించుకోలేము.డప్పు దరువుతో శత్రువును  తరిమికొట్టిన చరిత్రను చెపుతాడు.'ఆకలి పాటకు అన్ననై తోడుంటా/ఈ దోపిడీ రాజ్యంలో దండోరా మోగిస్తా'అంటూ అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే ఏ పోరాటంలోనైనా, ఉద్యమంలోనైనా డప్పు పాత్రను చెపుతాడు. 'పరిణామము' పాటలో 'ప్రకృతి పరిణామమో/ఈ సృష్టి గొప్పతనమో' అంటూ సమాజినికి భౌతికవాద దృక్పథాన్ని బొడిస్తాడు. 'రాయి' పాటలో 'రాయి రాయికి మధ్య రతి సంభవించగా/రాజుకోని అగ్గి పోసుకుంది పురుడు'అంటూ రాళ్లకు జీవన్నిస్తూనే జీవన సంఘర్షణలు చెప్తాడు. 'హరితవనం'పాటలో 'కూర్చున్న కొమ్మను నరికేస్తే/కూలిపోతది సమాజమే' అని 'లెల్లాయి లెల్లాయి' పాటలో 'ఆట పాటతో ఊరువాడ /హరితహారం జెయ్యాలే' చెట్ల యొక్క ప్రాధాన్యత ను చెప్తూ 'హరితహారం' కార్యక్రమం యొక్క అవసరాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. 'పసిరిక' పాటలో పచ్చదనం యొక్క గొప్పతనాన్ని చెప్తూనే 'బతుకు బాదల గోస జానపదుల యాస/వెన్నెల్లో సావట్ల యక్షగానాలాట/బాలసంతుల గంట శంకు సైరన్ కూత/గంగేడ్ల సయ్యాట చిలక పంచాంగము/బుడుబుడుకలోల్లాట బుడిగెజంగం పాట/సన్యాసి రాగాలు, భైరాగి తత్వాలు/కళలెన్నో పోషించే కపటమన్నది లేక/నిత్య నూతన రంగస్థలమైన నా పల్లె/ఎంతందమెంతదమో....' అంటూ తెలంగాణ పల్లె యొక్క వైవిధ్యభరితాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాడు.

Also Read: కాలానికే సవాలు విసిరిన మిట్టపల్లి సురేందర్

చెరువుల అవసరాన్ని 'మిషిన్ కాకతీయ' పథక ప్రాముఖ్యాన్ని ప్రజలకు చెప్తూ 'నాగరికత మూలమంత నదుల ఇంద్రజాలమేకదా/జీవజాలం పుట్టుకన్నది నాచులోనే మొదలుకొన్నది/బతుకు నీవే మెతుకు నీవే చెరువమ్మా' అంటూ నాగరికతను, జీవుల పుట్టుకను తెలియజేప్తాడు. 'భూతల్లి పాటలో 'పాముగట్టిన సావనోడు/దోమగట్టి సావబట్టే'అని పర్యావరణ కాలుష్యాన్ని చూసి చలించిపోతాడు.'కక్షగట్టి కాలుష్యం కాలబెడుతుంది/భూమిలోని సారమంత బూడిదయ్యింది'అని రసాయనిక ఎరువుల వాడకం, యంత్రాల పొగలు, సెల్ టవర్ తరంగాలు వంటి వాటితో భూతల్లి క్షోభిస్తుంది అంటాడు.

'నన్ను గన్న నా పల్లె' పాటలో కాలుష్యం చెరిగి కరువు కోరల నలిగి/అస్థిపంజరమోలే సచ్చి బతుకుతున్న'అని పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతల అవసరాన్ని ప్రజలకు ఎరుకపరుస్తాడు. 'సంసారం' గేయంలో 'ఏం చేద్దునో ఎంతకని జేద్దునో/సంసారం సల్లగుండా సావన్న రాదాయే'అని పాడుతూ మధ్యతరగతి జీవితంలో ఉండే బాధలను చూపెడుతాడు. నాన్న, అవ్వ,అర్ధాంగి పాటలో కుటుంబం గొప్పతనాన్ని చెప్తాడు. 'అంటరానివాళ్ళు అని అవహేళన చేస్తుంటే/మనుధర్మం మంట గలిపి కంటనీరు తుడిసినావు'అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన కలాన్ని గూర్చి పాడుకుంటాడు.'ఏది నీ సొంతమనుకోకూరా/దేనికి బానిసై పోకురా/వ్యర్ధమైనది మనిషి స్వార్ధమేరా/దాన్ని లొంగదీసిన జన్మ ధన్యమేరా..' అంటూ జీవిన తత్వాన్ని భోదిస్తాడు. బడిబాట కార్యక్రమానికి రాసిన పాటలో మోయలేని బడిసంచి వాని వీపుకెత్తిర్రు/కట్టలేని బడిఫీజు మన నెత్తి మోపుతుండు'అంటూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలను చైతన్యపరుస్తాడు.'జెనపదం' పాటలో తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు పాట ఏవిదంగా ఊతమిచ్చింది, ఆడవాళ్లను కించపరిచే నేటి సినిమా పాటలతో పోలిస్తే జానపదం ఎప్పుడూ శిఖరమే అంటూనే 'ప్రపంచీకరణతో పలుచనైనా/చావలేక బతికి చస్తువున్నా'అంటూ వాపోతాడు.

'కవులం మేము'పాటలో 'కవులం మేము కళాకారులం/కళల అలల పైన కన్నీటి నావలం'అంటూ సాగె పాటలో ప్రతి కవి ఆవేదనను చెప్తాడు.నిర్భయ,ఉన్మాదం, గృహహింస, ఆడశిశువు, భద్రత, భ్రౄణహత్యలు,సారా పోరు,హక్కుల పిడికిలెత్తు వంటి పాటల్లో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూనే,'స్వేచ్ఛ లేని ఈ సమాజ మార్పుకై/ఓర్పు వీడి నువ్వు పోరాడాలి తల్లీ' అంటూ వారికి ధైర్యాన్ని నురిపోస్తాడు.'కులగోడలు'పాటలో 'కులగోడలు కూలగొట్టాలిరా/మనువాదులను బొంద పెట్టాలిరా/ఆచారాలకు అగ్గి బెట్టాలిరా/కోతి నుండి జాతి బుట్టిందిరా/మధ్యలో మతమెట్ల పుట్టిందిరా' వంటి సూటి ప్రశ్నలను సంధిస్తాడు.'రెచ్చగొట్ట చిచ్చు పెడుతుంది రాజ్యం/మనిషి మనిషిని చంపుకునే తత్వము'అని మతవిద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడిపే పార్టీల కుట్రలను ప్రజల ముందు ఎండగడుతాడు.

'కూసోని మేసేటోడు కులమును కనిపెట్టిండన్నా/బావవాద మహిమలు జూపి భౌతిక విలువల్ని తొక్కి/బలహీనుల రక్తందాగ అవతరించే అగ్రవర్ణము' అంటూ 'కులమెట్ల బుట్టె'పాట సాగుతుంది. కులవృత్తులపై రాసిన గేయాలైన కంసాలి, గౌడన్న, నాయబ్రాహ్మణులం, సాకలోళ్లం, తెనుగోళ్ళు, కుమ్మరోళ్ళం, గోళ్లకుర్మలు,ఒడ్డెరోళ్ళు వంటి పాటల్లో 'నీ రెక్కలు పిండి జేసినా కొండలు/నినుజూసి కరుగవు గుండెలు' అంటూ వాళ్ళ బతుకుగోస, శ్రమైకజీవన సౌందర్యాన్ని చూపెడుతాడు.'జిందాబాద్ హైదరాబాద్' పాటలో 'బతుకుదెరువు బందుత్వమిది/వలస పక్షులకు గర్భగుడి'అని నగర జీవన వైరుధ్యాలను వినిపిస్తాడు. 'మంత్రాలు పాటలో 'మంత్రాలతో మరణిస్తారంటే/మరణాయుడలేందుకు/మాటలకు శక్తి ఉంటే/నాటో నాసాలెందుకురా' అని మూఢనమ్మకాలపై పాడి జనాలను జాగురుతపరుస్తాడు.చాకలి ఐలమ్మ, అంబెడ్కర్, పూలే,కాళోజీ,శ్రీశ్రీ, జయశంకర్, కొమరం బీమ్ లపై రాసిన పాటల్లో 'అమరుడా కొమరం భీమ్ నిన్ను ఎట్లా మరుతుమురా' అనే పాట వింటూఉంటే రోమాలు నిక్కపొడుస్తాయి.విద్యార్థులు పార్టీల కోణంలో, కుల దృక్పథంతో కాకుండా వర్గ దృక్పథంతో పోరాడాలని పిలుపునిస్తాడు.

Also Read: అరుణపట్టకంలో రంగమెటియా కొండలు! దేశరాజు అంతర్, బహిర్ యుద్ధారావం!!

అణగారిన వర్గాలపై, ప్రకృతి రమణీయతపై ,పర్యావరణ కాలుష్యంపై ఏ పాట రాసినా తనది ప్రజల పక్షమే. 'కవికి కాదేదీ అనర్హం' అన్నట్టుగా ఏ వస్తువును,సందర్భాన్ని వదిలిపెట్టలేదు. ఆళ్లకోస పుస్తకంలో 101 పాటలతో కూర్చిన కూర్పు సుమతి శతకం, వేమన శతకాల్లో ఉన్న తాత్వికతను చెప్పే నవయువ వాగ్గేయకారుడు అనిపిస్తుంది. అరుణోదయ రామారావుపై పాడిన పాట' నువ్వు గొంతెత్తితే గోదావరీ లోయ లోయంత ఊగింది ఉయ్యాలా/నీ పాట వింటే నక్సల్బరీ నవ యౌవనమైంది ఆవేళా' అనే విప్లవ గీతిక వింటే తను పదాలకే ఉద్యమాన్ని నేర్పగల సమర్థుడని అర్ధమవుతుంది. ఒక నిరుపేద కళాకారుడు వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూనే ప్రజలను చైతన్యం చేయడానికి వేల పాటలు రాసిన అసమాన్యుణ్ణి ప్రభుత్వం ఆదరించి చేరదీయడం అత్యవసరం.

- ముఖేష్ సామల

Follow Us:
Download App:
  • android
  • ios