సూసైడ్ నోట్ లు కాదు...టీఆర్ఎస్ మరణశాసనం రాయాలి: ఆర్టీసి కార్మికులతో బిజెపి ఎంపీ
కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న దీక్షకు బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా నిలిచిన బిజెపి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
కరీంనగర్: మహబూబాబాద్ లో ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వివధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు దారుణమని బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధన, మృతుని కుటుంబానికి న్యాయం కోసం ధర్నా చేస్తే అక్రమ అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సీతయ్యను కూడా అక్రమంగా అరెస్టు చేశారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడబోమని.... కేసీఆర్ నియంతృత్వ వైఖరిపై మరింత తీవ్రంగా పోరాడుతానని అన్నారు.
read more ఆర్టీసీ విభజన:కేంద్రంతో విభేదించిన కేసీఆర్ సర్కార్
అరెస్టు చేయాల్సింది ఆందోళనకారులను కాదు...చట్ట వ్యతిరేక వ్యాఖ్యలతో కార్మికుల ప్రాణాలు తీస్తున్న సీఎం కేసీఆర్ ను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. కోరుట్ల డిపోలో ఆర్టీసీ సమ్మె దీక్షా శిబిరంలో కార్మికులకు ఎంపీ బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు రాయాల్సింది సూసైడ్ నోట్ లు కాదు... టీఆర్ఎస్ పాలనకు మరణ శాసనం రాయాలని సూచించారు.
కష్టజీవులైన ఆర్టీసీ ఉద్యోగులు బిగించాల్సింది ఉరితాళ్లు కాదు.... పిడికిళ్లు బిగించాలన్నారు. ఆవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటే... ఆందోళన చెంది గుండెపోటుకు గురైతే... మన కుటుంబం రోడ్డున పడతామరి... అలా కాకుండా నియంత కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా రోడ్డున పడేద్దామని అన్నారు. ఈ యుద్ధంలో భయపడుతారా... భయపెడుతారో... మీరే తేల్చుకోవాలని ఎంపీ సంజయ్ కార్మికులకు దైర్యాన్ని నూరిపోశారు.
read more RTC Strike : మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు