గడువు పొడిగించేది లేదు.. విదేశీ సేనలు వెళ్లిపోవాల్సిందే: తాలిబాన్ స్పష్టీకరణ
ఆఫ్ఘనిస్తాన్లో విదేశీ సేనలు ఆగస్టు 31వ తేదీ తర్వాత ఉండటానికి వీల్లేదని తాలిబాన్లు స్పష్టం చేశారు. ఆగస్టు 31 గడువు పొడిగించబోమని, విదేశీ బలగాలు వెళ్లిపోవాల్సిందేనని పునరుద్ఘాటించాయి.
న్యూఢిల్లీ: గడువులోపు విదేశీ సేనలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లిపోవాల్సిందేనని తాలిబాన్లు స్పష్టం చేశారు. ఆగస్టు 31వ తేదీ తర్వాత విదేశీ బలగాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండటానికి వీల్లేదని తెలిపారు. కాగా, ఆగస్టు 31వ తేదీలోపు తమ పౌరులను స్వదేశాలకు తరలించడం సాధ్యమయ్యే పనికాదని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి. ఆగస్టు 31లోపు తమ బలగాలను వెనక్కి తెచ్చుకుంటామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. మరోమాట పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు బలగాలు అక్కడే ఉంటాయని చెప్పారు. కానీ, తాలిబాన్లు మాత్రం ఆగస్టు 31 తర్వాత విదేశీ బలగాలు తమ దేశంలో ఉండటానికి వీల్లేదని పునరుద్ఘాటించాయి.
మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలోనే అమెరికా నిఘా విభాగం సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ తాలిబాన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్తో కాబూల్లో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. ఈ భేటీ అనంతరం తాజాగా తాలిబాన్ల ప్రకటన వెలువడటం గమనార్హం. అయితే, సీఏఐ భేటీలో అమెరికా ప్రతిపాదనలపై తాలిబాన్లు మరోసారి తమ ప్రకటనలు సవరించుకుంటారా? లేదా? అనే విషయం తేలాలంటే వేచి చూడాల్సిందే.