ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రస్తుతం మంకీపాక్స్ టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14,000 మంకీపాక్స్ కేసులు నమోదైనట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రస్తుతం మంకీపాక్స్ టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14,000 మంకీపాక్స్ కేసులు నమోదైనట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఆఫ్రికాలో మంకీపాక్స్తో ఐదు మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు నివేదించబడిన మంకీపాక్స్ కేసుల్లో చాలా కేసులు యూరప్లో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉన్న వారిలోనే ఉన్నట్టుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మంకీపాక్స్ వ్యాప్తికి సంబంధించి డబ్ల్యూహెచ్వో.. ఒక కమిటీతో కీలక సమావేశాన్ని గురువారం నిర్వహించనుంది. అయితే కమిటీ సిఫార్సుతో సంబంధం లేకుండా మంకీ పాక్స్ వ్యాప్తిని అరికట్టేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉంటామని టెడ్రోస్ అధనామ్ చెప్పారు. ‘‘కమిటీ సిఫార్సుతో సంబంధం లేకుండా.. వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి దేశాలకు మద్దతు ఇవ్వడానికి WHO మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉంటుంది’’ అని టెడ్రోస్ అధనామ్ తెలిపారు.
ఇక, భారత్లో కూడా రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. విమానాశ్రయాలు, ఓడరేవుల ద్వారా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించాలని ఆదేశించింది.విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు అందరి పైనా కఠినంగా స్క్రీనింగ్ చేయాలని స్పష్టం చేసింది. వారు మన దేశంలో అడుగుపెట్టగానే స్ట్రిక్ట్ హెల్త్ స్క్రీనింగ్ ఉండాలని పేర్కొంది.
ఇప్పటి వరకు ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపైనా స్క్రీనింగ్ చేశారు. అనుమానం ఉన్న శాంపిల్స్ను పూణెలోని ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ, మంకీపాక్స్ రెండో కేసు కూడా నమోదు కావడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.ఇక, దేశంలో నమోదైన రెండు కేసులు కూడా కేరళలోనే వెలుగుచూడటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.
