Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. గ్రామాల్లోకి లావా.. 13 మంది మృతి.. 4 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద.. వీడియో ఇదే

ఇండోనేషియాను మౌంట్ సెమెరు అగ్నిపర్వతం వణికించింది. శనివారం ఆకస్మికంగా ఇది బద్ధలైంది. చుట్టుపక్కల గ్రామాలపైకి లావాను వెదజల్లింది. అగ్నిపర్వతం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. చుట్టుపక్కల గ్రామాల్లో బూడిద మేటలు వేసింది. ఇళ్లు, వాహనాలు, ఇతరత్రాలన్నింటినీ కమ్మేసింది. ఆదివారం ఈ గ్రామాల్లో మృతుల సంఖ్య 13కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతానికి సంబంధించి భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

volcano erupts.. 13 killed in indonesia
Author
New Delhi, First Published Dec 5, 2021, 12:56 PM IST

న్యూఢిల్లీ: ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియాలో ఘోర విపత్తు సంభవించింది. జావా దీవిలో అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ సెమెరు బద్ధలైంది. ఈ అగ్నిపర్వతం నుంచి లావా ఏరులై పారింది. సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశించి బీభీత్సం సృష్టించింది. గ్రామస్తులు వెంటనే పిల్లలను, మేకలను మోసుకుంటూ ఊరు విడిచి దూరంగా పరుగులు తీశారు. ఆకాశంలోకి సుమారు నాలుగు కిలోమీటర్ల ఎత్తునకు అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగజిమ్మింది. సమీప గ్రామాల్లోని నివాసాలు, ఇతరత్రాలు అన్నీ లావా, బూడిదలో కప్పుకుపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 13 మంది మరణించినట్టు విపత్తు సహాయక అధికారులు ఆదివారం వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఇండోనేషియాకు చెందిన దీవి జావాలో తూర్పు వైపున గల అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ సెమెరు శనివారం అకాస్మత్తుగా బద్ధలైంది. గంటల కొద్దీ బూడిద ఆకాశంలోకి వెదజల్లడంతో పట్టపగటిలే రాత్రిని తలపించింది. ఆకాశంలో బూడిద పూర్తిగా కమ్మేసింది. అక్కడ సూర్యుడు కనిపించకుండా మారిపోయింది. దీంతో సాయంత్రం 5.30 గంటల సమయంలోనే పూర్తిగా చీకటులు కమ్మేశాయి. అగ్నిపర్వతం బద్ధలవ్వగానే వేలాది మంది గ్రామస్తులు దూరంగా పరుగులు పెట్టారు. చాలా మందికి తాత్కాలిక శిబిరాల్లో ఆవాసం కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా లుమాజాంగ్ జిల్లాలోని 11 గ్రామాలను బూడిద దట్టంగా కప్పేసింది. నివాసాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలన్నింటినీ బూడిద కప్పేసింది. పశువులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సుమారు తొమ్మిది వందల మంది మసీదులు, స్కూళ్లు, కమ్యూనిటీ హాల్స్‌లో తలదాచుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ అగ్నిపర్వత ప్రభావం ఉన్నది.

Also Read: స్పెయిన్‌లో బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు

ఈ క్రమంలోనే అగ్నిపర్వతం సమీప గ్రామాల్లో మృతుల సంఖ్య 13కు పెరిగినట్టు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి అబ్దుల్ ముహారి వెల్లడించారు. కనీసం 57 మంది గాయపడ్డట్టు తెలిపారు. ఇందులో 41 మందికి కాలిన గాయాలు అయ్యాయని వివరించారు. వారిని హాస్పిటల్‌లో చేర్చినట్టు చెప్పారు. లుమాజాంగ్ చుట్టుపక్కల గ్రామాల్లో చిక్కుకున్న సుమారు 10 మందిని కాపాడినట్టు పేర్కొన్నారు. ఆదివారం ఈ సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు తెలిపారు. భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వర్షాలు కురిస్తే ఇప్పటికే జావాలో ఆకాశమంతా వ్యాపించిన బూడిద మేఘాలు నేలపై కురిసే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అది లావా రూపంలోనూ ఆ ప్రాంతంలో నదిలా ప్రవహించే ముప్పూ లేకపోలేదని ఆ దేశానికి చెందిన టాప్ వల్కనాలజిస్ట్ సురోనో వివరించారు.

లుమాజాంగ్‌లోని ఓ కీలక బ్రిడ్జీని లావా, ఇతర శిథిలాలు కలిసిన ప్రవాహం ధ్వంసం చేసిందని, తద్వారా సహాయక చర్యలు వెంటనే అమలు చేయడానికి ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నదని అబ్దుల్ ముహారి అన్నారు. హెవీ లోడర్స్ ఇందుకోసం వినియోగిస్తున్నామని చెప్పారు. సెమెరూ లావా ప్రవహించిన ప్రాంతాలకు కనీసం ఐదు కిలోమీటర్ల కంటే సమీపానికి వెళ్లవద్దని స్థానికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జావా దీవి దక్షిణ ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం నుంచి లావా హిందూ మహాసముద్రాన్ని చేరుతుండటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios