ఇంగ్లాండ్లో టీమిండియా.. మాల్యాపై భారత్ నిషేధం
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును విజయ్ మాల్యా కలవకుండా భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎస్బీఐ సహా పలు బ్యాంక్లకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు మాల్యా
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును విజయ్ మాల్యా కలవకుండా భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎస్బీఐ సహా పలు బ్యాంక్లకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు మాల్యా. క్రికెట్ను బాగా ఇష్టపడే మాల్యా క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవాడు. అయితే రుణాలు ఎగ్గొట్టి లండన్కు పారిపోయిన తర్వాత బయట కనిపించడం మానేశాడు.
ఆయన కోసం భారత దర్యాప్తు బృందాలు తీవ్రంగా గాలిస్తుండగా.. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్-పాక్ మ్యాచ్లో మాల్యా తళుక్కున మెరిశాడు. అంతేకాదు, ఈ టోర్నీలో భారత్ ఆడిన పలు మ్యాచ్లను కూడా వీక్షించాడు. దానితో పాటు క్రికెటర్లకు ఇచ్చిన ఒక పార్టీకి కూడా వచ్చాడని తెలుసుకున్న మేనేజ్మెంట్ ఆటగాళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది.
తాజాగా టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు రావడంతో భారత జట్టును కలిసేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా భారత ప్రభుత్వాన్ని కోరాడట. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లను కలిసేందుకు వీల్లేదని.. వారిని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని ప్రభుత్వం మాల్యాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయ్ నిరుత్సాహానికి గురయ్యాడు.