2024 ఎన్నికల బరిలో నిలుస్తాను.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు జో బైడెన్ మంగళవారం అధికారిక ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరో నాలుగేళ్లు అమెరికా అధ్యక్ష పదవీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాను మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండనున్నట్టుగా జో బైడెన్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మూడు నిమిషాల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దేశానికి సేవ చేసేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని కోరారు.
ఆ వీడియో ప్రారంభంలో 2021 జనవరి 6వ తేదీన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్పై దాడి చేసిన చిత్రాలను ఉంచారు. ఆ తర్వాత మాట్లాడిన జో బైడన్.. ‘‘ప్రతి తరానికి వారు ప్రజాస్వామ్యం కోసం నిలబడవలసిన క్షణం ఉంటుంది. వారి ప్రాథమిక స్వేచ్ఛ కోసం నిలబడాలి. ఇది మాది అని నేను నమ్ముతున్నాను. అందుకే నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నాను’’ అని తెలిపారు.
‘‘నాలుగు సంవత్సరాల క్రితం నేను అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు.. మేము అమెరికా ఆత్మ కోసం యుద్ధంలో ఉన్నామని చెప్పాం. మేము ఇప్పటికీ ఉన్నాము. ఇది ఆత్మసంతృప్తి చెందడానికి సమయం కాదు. అందుకే నేను మళ్లీ ఎన్నికలకు పోటీ చేస్తాను’’ అని జో బైడెన్ పేర్కొన్నారు.