అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు: ప్రతినిధుల సభలో ట్రంప్కు షాక్
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజార్టీ సీట్లు సాధించే దిశగా సాగుతున్నారు.
న్యూయార్క్: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజార్టీ సీట్లు సాధించే దిశగా సాగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ సెనేట్లో ఆధిక్యం కొనసాగిస్తోంది.
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ( ప్రతినిధుల సభ)లో డెమోక్రాట్లు మెజార్టీ సీట్లు సాధించే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
ఈ స్థానాలతో పాటు 36 రాష్ట్రాల గవర్నర్లకు కూడ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు డెమోక్రట్లు 23 స్థానాల్లో విజయం సాధిస్తే ప్రతినిధుల సభలో ఈ పార్టీయే పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా, కొలొరాడో రాష్ట్రాల్లో రిపబ్లికన్లపై డెమోక్రట్లు విజయం సాధించారు. మరో వైపు సెనేట్లో నార్త్ డకోటా, ఇండియానా, టెక్సాస్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ ఎన్నికల ఫలితాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పని తీరుకు రెఫరెండంగా భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల్లో తాము అద్భుత విజయం సాధించామని ట్రంప్ ట్వీట్ చేయడం గమనార్హం. 2016లో అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ విజయం సాధించారు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రట్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించడం ట్రంప్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.