రష్యాతో చర్చలు జరపడానికి తమ దేశం సిద్దంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) చెప్పారు. అయితే పొరుగున ఉన్న బెలారస్ మాత్రం చర్చలు జరపబోమని తెలిపారు.
రష్యాతో చర్చలు జరపడానికి తమ దేశం సిద్దంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) చెప్పారు. అయితే పొరుగున ఉన్న బెలారస్ మాత్రం చర్చలు జరపబోమని తెలిపారు. బెలారస్ను దండయాత్రకు వేదికగా జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు జెలెన్ స్కీ పలు ప్రాంతాలను సూచించారు. వార్సా, బ్రాటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకులను చర్చలకు వేదికగా ప్రతిపాదించినట్టుగా చెప్పారు.
‘మేము మాట్లాడాలనుకుంటున్నాము.. మేము యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం’ అని జెలెన్ స్కీ ఒక వీడియోలో చెప్పారు. అయితే క్షిపణులను ఉంచిన దేశంలో మాత్రం చర్చలు జరపలేమని తెలిపారు. ఇక, శాంతి చర్చల కోసం తమ నాయకులు బెలారస్ చేరుకున్నారని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) నుంచి ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. తాము కూడా శాంతి చర్చలకు సిద్దమని Zelensky చెప్పారు.
బెలారస్లో చర్చలకు సిద్దమంటున్న రష్యా..
ఉక్రెయిన్ భీకరంగా విరుచుకుపడుతున్న రష్యా.. అసలు వెనక్కి తగ్గడం లేదు. కేవలం సైనిక స్థావరాలే తమ లక్ష్యం అని చెబుతున్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు కూడా రష్యా దాడుల్లో మృత్యువాతపడుతున్నారు. రష్యాపై ఓ వైపు బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. తాము చర్చలకు సిద్దమేనని తెలిపింది. ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇరు దేశాలకు సరిహద్దు దేశమైన బెలారస్లో తమ ప్రతినిధులు చర్చలకు జరిపేందుకు సిద్దంగా ఉంటారని తెలిపారు.
మరోవైపు రష్యా నాలుగో రోజు ఉక్రెయిన్పై యుద్దాన్ని కొనసాగిస్తుంది. పలు నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు దూసుకెళుతుంది. పలునగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. రాజధాని కీవ్ నగరంపై మిస్సైల్ దాడులకు పాల్పడింది. ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్లో రష్యన్ దళాలు ప్రవేశించాయి. రాత్రిపూట రష్యా బలగాలు జరిపిన దాడులలో ఖార్కివ్ వెలుపల గ్యాస్ పైప్ లైన్ను రష్యన్ దళాలు తగలపెట్టాయి. మరోవైపు కీవ్ సమీపంలోని వాసిల్కివ్లోని చమురు డిపో రష్యా క్షిపణి దాడితో ధ్వంసమైంది.
ఇక, కీవ్ నగరాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు ఉక్రెయిన్ బలగాలు తీవ్ర ప్రతిఘటనను కొనసాగిస్తున్నాయి. Kviv నగరం పూర్తిగా తమ Army ఆధీనంలోనే ఉందని Ukraine ఆదివారం నాడు ప్రకటించింది. శనివారం నాడు విధ్వంసం తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపింది. ఇక, కీవ్ ను విడిచివెళ్లేందుకు అధ్యక్షుడు Zelensky నిరాకరించారు. కీవ్ ను రక్షించుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని జెలెన్స్కీ కోరారు. అంతేకాకుండా కీవ్ నగరంలోని వీధుల్లో తిరిగిన ఫొటోలను షేర్ చేస్తూ ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు.
