రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం నేలకూల్చింది. చెర్నిహివ్ నగర శివారుల్లో వైమానిక దాడికి వచ్చిన విమానాన్ని విజయవంతంగా కూల్చేశారు. ఆ ఘటనలో కో పైలట్ మరణించాడు. కాగా, పైలట్ సేఫ్గా బయటపడ్డాడు. ఆ పైలట్ను ఉక్రెయిన్ సేనలు తమ అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆయనను బంధించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సైన్యం రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసింది. ఆ ఘటనలో రష్యా యుద్ధ విమానానికి చెందిన కో పైలట్ మరణించాడు. కాగా, పైలట్ మాత్రం సేఫ్గా ఎజెక్ట్ అయ్యాడు. చెర్నిహివ్ నగర శివారుల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేఫ్గా బయటపడిన పైలట్ను ఉక్రెయిన్ సైన్యం నిర్బంధంలోకి తీసుకుంది. ఆయన పేరును క్రాస్నోయెర్ట్సెవ్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఉక్రెయిన్లోని చెర్నిహివ్ రీజియన్లో రష్యా వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో మొత్తం విధ్వంసం జరిగింది. శిథిలాల కింద కనీసం 22 మృతదేహాలను రికవరీ చేసుకున్నట్టు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. అయితే, సరిగ్గా వైమానిక దాడులు ఎక్కడ జరిగాయో మాత్రం వివరించలేదు. అంతకు ముందు రెండు పాఠశాలలు, నివాసాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 9 మంది మరణించినట్టు స్థానిక గవర్నర్ తెలిపారు.
రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ లో వివిధ దేశాలకు చెందిన పౌరులు, విద్యార్థులు చిక్కుకున్నారు. ఇందులో మన ఇండియాకు చెందిన స్టూడెంట్లు కూడా ఉన్నారు. వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా (operation ganga) పేరిట ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఇప్పటి వరకు 48 తరలింపు విమానాల ద్వారా దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చామని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. మిగితా వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఎంబసీ (indian embassy) ఆ స్టూడెంట్లను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసింది. ఖార్కివ్లోని పిసోచిన్ నుండి 298 మంది భారతీయ విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. రష్యా, ఉక్రేనియన్ దళాల మధ్య ఖార్కివ్ లోనే తీవ్రంగా ఘర్షణ జరుగుతోంది. ‘‘పిసోచిన్ (Pisochyn)లోని మా 298 మంది విద్యార్థులను చేరదీస్తున్నాము. బస్సులు మార్గంలో ఏర్పాటు చేశాం. త్వరలోనే అవి వస్తాయని భావిస్తున్నాం. దయచేసి అన్ని భద్రతా సూచనలు, జాగ్రత్తలను అనుసరించండి. సురక్షితంగా ఉండండి, ధైర్యంతో ఉండండి ’’ అని ఇండియన్ ఎంబసీ ఒక ట్వీట్ లో పేర్కొంది.
రష్యా దాడి చేస్తున్న సందర్భంలో ఉక్రెయిన్ .. నాటోకు ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ (No Fly Zone)గా ప్రకటించాలని కోరింది. దీనిపై నాటో కూటమి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం తాము ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించలేమని స్పష్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ (volodymyr zelensky) నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు నాటో సదస్సు జరిగింది. అది చాలా బలహీనమైన సదస్సు. కన్ఫ్యూజ్డ్ సదస్సు అని మండిపడ్డారు.
రష్యాపై ఆంక్షలు (sanctions on russia) విధించడం యుద్ధంతో సమానమన్న ఆయన.. నాటో (nato) దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఊహించిన దానికంటే భీకరంగా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తామని పుతిన్ వ్యాఖ్యానించారు. మా డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం ఆగదని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామని రష్యా అధినేత తెలిపారు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని పుతిన్ పేర్కొన్నారు. రష్యాలో మార్షల్ లా అవసరం లేదని ఆయన అన్నారు.
