యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా కన్నుమూత.. దేశాధినేతల సంతాపం
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఖలీఫా మరణానికి సంతాప సూచికంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.
యూఏఈ అధ్యక్షుడు (uae president) షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Sheikh Khalifa Bin Zayed Al Nahyan) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. నవంబర్ 3, 2004 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. నహ్యాన్ మరణం నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు సహా ప్రైవేట్ రంగంలో దాదాపు 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అలాగే మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది.
తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నుంచి వారసత్వంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షేక్ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.
తన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్తో (Mohammed bin Zayed) కలిసి నహ్యాన్ రోజువారీ పాలనా వ్యవహారాల్లో చాలా రోజులుగా కనిపించడం మానేశారు. ఆయన మరణం నేపథ్యంలో యూఏఈ తదుపరి అధ్యక్షుడి గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.