అమెరికా ను క్షిపణుల దాడుల నుంచి కాపాడేందుకు గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా అనే ప్రాజెక్టును ట్రంప్ ప్రారంభించారు.

అమెరికాను క్షిపణి దాడుల నుంచి కాపాడుకోవడానికి మూడు సంవత్సరాల్లో గోల్డెన్‌ డోమ్‌ ఫర్‌ అమెరికాను ఏర్పాటు చేయబోతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీని కోసం మొదటివిడతలో 25 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 175 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ‘‘ అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని అమెరికా ప్రజలకు హామీ ఇచ్చాను. 

అంతరిక్షం నుంచి దాడి చేసినా..

ఆనాడు చెప్పినట్లుగానే ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రపంచంలోని ఏవైపు నుంచి ప్రయోగించినా.. చివరికి అంతరిక్షం నుంచి దాడి చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్‌ డోమ్‌కు ఉంటుంది. ఇది అమెరికా సాధిస్తున్న మరో గొప్ప విజయం. దేశ ప్రజల మనుగడకు ఎంతో ముఖ్యమైన ముందడుగు’’ అంటూ ట్రంప్పే చెప్పుకొచ్చారు.

175 బిలియన్‌ డాలర్లు

యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణం రూపుదిద్దుకుంటుందని ట్రంప్‌ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ముందుకు వస్తున్నట్లు వివరించారు. డోమ్‌ నిర్మాణానికి 175 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ.. దీనికి 542 బిలియన్‌ డాలర్ల కు పైగా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని కాంగ్రెస్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ అంటుంది.

పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ దీని గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్‌లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.