మహిళలపై మేం అరాచకాలకు పాల్పడటం లేదు.. అంతా విష ప్రచారమే: తాలిబన్లు
తమపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం లేనిపోని అభాండాలు వేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తోందని తాలిబన్లు మండిపడ్డారు. ప్రజలను ముజాహిదీన్లు చంపేస్తున్నారని, చెరబడుతున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
మహిళలు, యువతులపై తాము అరాచకాలకు పాల్పడుతున్నామన్న వ్యాఖ్యల్లో నిజం లేదని ప్రకటించారు తాలిబన్లు. తమ ఫైటర్లను పెళ్లి చేసుకోవాలన్న ఆదేశాలను తాము ఇవ్వలేదని వారు ఆదివారం వెల్లడించారు. తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ విషయాన్ని తెలిపారు. తమపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముజాహిదీన్లను పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయిలపై తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నారన్న ఆఫ్ఘనిస్థాన్ సైన్యం మాటల్లో నిజం లేదని షాహీన్ చెప్పాడు. తమపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం లేనిపోని అభాండాలు వేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను ముజాహిదీన్లు చంపేస్తున్నారని, చెరబడుతున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.
Also Read:ఆఫ్గనిస్తాన్: అనుకున్నదే అయ్యింది.. కాబూల్లోకి ప్రవేశించిన తాలిబన్లు
కాగా, ఆఫ్గానిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబూల్కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్ జెండాలు పాతుకుపోయాయి. జలాలబాద్ ఆక్రమణతో కాబూల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే తాలిబన్లు రాజధాని కాబూల్లోకి ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా ఆఫ్గన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తోంది. హెలికాఫ్టర్ల ద్వారా దౌత్య సిబ్బందిని తరలిస్తోంది.