కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి చైనాకు సహకరిస్తాం.. తైవాన్ ఆఫర్
కరోనా మహమ్మారితో తల్లడిల్లుతున్న చైనాకు సహకరించడానికి తాము సిద్ధం అని తైవాన్ ఆఫర్ చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా తైవాన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఆఫర్ ప్రకటించారు. అయితే.. తైవాన్ సమీపంలో చైనా మిలిటరీ కార్యకలాపాలు నిర్వహించడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: తైవాన్ అధ్యక్షురాలు త్సా ఇంగ్ వెన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. చైనాకు ఓ ఆఫర్ ఇచ్చారు. కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి తైవాన్ సహకరిస్తుందని అన్నారు. కరోనా భయానక వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వివరించారు. అదే సందర్భంలో దాని మిలిటరీ కార్యకలాపాలను వ్యతిరేకించారు. తైవాన్ దీవి సమీపంలో చైనా మిలిటరీ కార్యకలాపాలు శాంతి, సుస్థిరతకు ఎంతమాత్రం ఉపయోగపడవని వివరించారు.
చైనా ప్రస్తుతం కరోనా విజృంభణతో సతమతం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో మానవత్వంతో చైనాకు అవసరమైన సహకారం చేస్తామని అన్నారు. ఈ మహమ్మారి నుంచి అక్కడి ప్రజలు బయటపడి సురక్షితమైన కొత్త సంవత్సరాన్ని పొందడానికి సహకరిస్తామని వివరించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉద్దేశిస్తూ తైవాన్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు మించి ఎక్కువ వివరణ ఇవ్వలేదు.
Also Read: ఎవరి నియంత్రణను సహించం.. చైనాపై యుద్దానికి సిద్దమవుతున్న తైవాన్..
చైనాతో తాము చర్చలు కోరుకుంటున్నామని, ఈ సమస్యలకు యుద్ధం ఒక పరిష్కారంగా తాము చూడటం లేదని పునరుద్ఘాటించారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ న్యూ ఇయర్ అడ్రెస్లో తైవాన్ ప్రస్తావన తెచ్చారు. తైవాన్ స్ట్రెయిట్కు అటు వైపు, ఇటు వైపు ఉన్న ప్రజలంతా ఒకే కుటుంబానికి చెందినవారని ఆయన అన్నారు. తైవాన్ను చైనా నియంత్రణలోకి తీసుకోవాలనే మాటను ఆయన అనలేదు.
అమెరికా ప్రతినిధులు చైనాకు కాకుండా నేరుగా తైవాన్ వెళ్లినప్పటి నుంచి ఈ రెండింటి మధ్య విభేదాలు పెరిగాయి. తైవాన్ తమలో అంతర్భాగం అని చైనా పేర్కొంటుండగా.. తైవాన్ ఈ వాదనను తిరస్కరిస్తున్నది.