65 ఏళ్ల వయసులో రెండో పెళ్లి: లాయర్ హరీశ్ సాల్వే సంచలన నిర్ణయం
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో తెలియదు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇందుకు సంబంధించి ఎన్నో సంఘటనలు మనం నిత్యం చూస్తునే వున్నాం. తాజాగా ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, లండన్ ఆర్టిస్టు కరోలిన్ బ్రొసార్డ్ను వివాహం చేసుకోనున్నారు.
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో తెలియదు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇందుకు సంబంధించి ఎన్నో సంఘటనలు మనం నిత్యం చూస్తునే వున్నాం. తాజాగా ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, లండన్ ఆర్టిస్టు కరోలిన్ బ్రొసార్డ్ను వివాహం చేసుకోనున్నారు.
లండన్లోని చర్చిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య బుధవారం వీరి పెళ్లి జరుగనుంది. వీరిరువురికి ఇది రెండో వివాహం. హరీష్ సాల్వే గతంలో మీనాక్షిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సాక్షి సాల్వే, సానియా సాల్వే. కాగా ఈ ఏడాది జూన్లో హరీష్ సాల్వే, తన భార్య మీనాక్షి విడాకులు తీసుకున్నారు.
ఇక యూకేకు చెందిన ఆర్టిస్టు కరోలిన్ బ్రొసార్డ్(56)కు 18 ఏళ్ల కూతురు ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన హరీష్ సాల్వే, ఈ ఏడాది జనవరిలో కోర్ట్స్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్వీన్స్ కౌన్సిల్గా నియమితులయ్యారు.
ఈ క్రమంలో, ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న ఆయన, ఓ ఆర్ట్ ఈవెంట్లో కరోలిన్ను కలిసినట్లు తెలుస్తోంది. థియేటర్, శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి వీరిద్దరిని సన్నిహితులను చేసినట్లు సమాచారం.
ఇక తాను వివాహం చేసుకోనున్నట్లు 65 ఏళ్ల హరీష్ సాల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ సాల్వేకు తోటి న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1955లో మహారాష్ట్రలో జన్మించిన హరీష్ సాల్వే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా దేశ ప్రజలకు సుపరిచితులు. అదే విధంగా భారత సొలిసిటర్ జనరల్గా విధులు నిర్వర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపడంతో పాటు భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన కుల్భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సాల్వే వాదనలు వినిపించారు.
కుల్భూషణ్ విషయంలో.. పాకిస్తాన్ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్ పైచేయి సాధించడంలో హరీశ్ కీలక పాత్ర పోషించారు.
సాధారణంగా ఏదైనా కేసును వాదించేందుకు రోజుకు రూ.30 లక్షల చొప్పున చార్జ్ చేసే సాల్వే.. కుల్భూషణ్ కేసులో కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకోవడం గమనార్హం.