Sri Lanka Declares State Of Emergency: ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్రజలపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, జల ఫిరంగులను ప్రయోగించారు.
Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ప్రజా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే మరోసారి శ్రీలంక ఎమర్జెన్సీలోకి వెళ్లింది. భారీ ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తి అధికారాలు అప్పగించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు వెల్లువెత్తడంతో ఐదు వారాల్లో దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం రెండోసారి. దేశ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్రజలపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, జల ఫిరంగులను ప్రయోగించారు. దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు దిగింది. అంతకు ముందు శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే, అతని అన్నయ్య, ప్రధాని మహింద రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ నాయకుడు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు రెండు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని, మంత్రులు ఆర్థిక పరిస్థితికి సమిష్టి బాధ్యత వహించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
22 మిలియన్ల జనాభా ఉన్నశ్రీలంక లోని ప్రజలు చాలా నెలలుగా బ్లాక్అవుట్లు మరియు ఆహారం, ఇంధనం, మందుల కొరతతో పోరాడుతున్నారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత దారుణ పరస్థితులు ఇవే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే తన వ్యక్తిగత నివాసం వెలుపల భారీ నిరసనల తర్వాత ఏప్రిల్ 1న కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే, అప్పుడు ఎమర్జెన్సీని ఏప్రిల్ 5న ఉపసంహరించుకున్నారు.
కాగా, శ్రీలంక తన విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత శ్రీలంక దివాలా అంచుకు జారుకుంది. దేశం 2026 నాటికి చెల్లించాల్సిన USD 25 బిలియన్లలో ఈ సంవత్సరం USD 7 బిలియన్ల విదేశీ రుణాల చెల్లింపులను ఎదుర్కొంటుంది. శ్రీలంక విదేశీ నిల్వలలో USD 1 బిలియన్ కంటే తక్కువగా నిల్వలు ఉన్నాయి. విదేశీ కరెన్సీ సంక్షోభం దిగుమతులను పరిమితం చేసింది. దీంతో ఇంధనం, వంటగ్యాస్, మందులు, ఆహారం వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజలు తాము చేయగలిగిన వాటిని కొనడానికి గంటల తరబడి పెద్ద వరుసలలో ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. వాటి ధరలు సైతం రికార్డుల మోత మోగిస్తున్నాయి.
