స్పేస్‌ఎక్స్ రూపొందించిన స్టార్‌షిప్ రాకెట్ మూడోసారి గాల్లో పేలిపోవడం ఎలాన్ మస్క్‌కు మరోసారి చేదు అనుభవం తీసుకువచ్చింది.

అంతరిక్ష పరిశోధనలో ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్న అమెరికన్ టెక్ సంస్థ స్పేస్‌ఎక్స్ మరోసారి అనుకోని పరాజయాన్ని చవిచూసింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ రూపొందించిన మెగా రాకెట్ ‘స్టార్‌షిప్’ తాజా ప్రయోగం మరోసారి విఫలమైంది. ఇది వరుసగా మూడోసారి గాల్లోనే పేలిపోయింది.

ఈ రాకెట్‌ను మే 28న టెక్సాస్‌లోని బోకా చికా స్టేషన్ నుంచి నింగిలోకి ప్రయోగించారు. తొలుత ప్రయోగం విజయవంతంగా సాగినట్లు కనిపించింది. అయితే, ప్రయోగం ప్రారంభమైన సుమారు 50 నిమిషాల తర్వాత రాకెట్ గాల్లోనే విఫలమైంది. స్పేస్‌ఎక్స్ అందించిన సమాచారం ప్రకారం, స్టేజ్-సెపరేషన్ పూర్తయిన తర్వాత రాకెట్ రీ ఎంట్రీ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అది గాల్లోనే ధ్వంసమైపోయింది.

ఇదే తరహా సమస్యలు…

సుదూర గ్రహాల మీదకి మానవుల్ని పంపేందుకు స్పేస్‌ఎక్స్ రూపొందించిన స్టార్‌షిప్ ఈ మూడో ప్రయోగంలోనూ విఫలమైన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకటి రెండు ప్రయోగాల్లోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తాయి. అయినా సరే, స్పేస్‌ఎక్స్ తగ్గేదేలేదు అని ప్రయత్నాలు కొనసాగిస్తుందని సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ రాకెట్ పూర్తి స్థాయిలో పనిచేస్తే, భవిష్యత్‌లో చంద్రుడు, మంగళ గ్రహం వంటి దూర ప్రదేశాలకు మానవులను తీసుకెళ్లే గేట్వేగా ఇది మారనుంది. అయితే, వరుస వైఫల్యాలతో స్పేస్‌ఎక్స్ ముందున్న సవాళ్లు మరింత పెరిగినట్టయింది. రాకెట్ నిర్మాణం, పరిణామ దశలు, ప్రయోగాలపై కంపెనీ మరోసారి సమీక్ష చేపట్టి తదుపరి ప్రయత్నానికి సిద్ధమవుతోంది.

ఈ ప్రయోగం అమెరికా అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక దశగా భావించవచ్చు. కానీ, మూడోసారి కూడా గాల్లోనే పేలిపోవడం ఎలాన్ మస్క్ ఆశలపై నీళ్లు చల్లింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విఫల ప్రయోగం చర్చనీయాంశంగా మారింది.