చైనాలోని ఓ రెస్టారెంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్తో పేలుడు సంభవించడంతో 31 మంది మరణించారు.
చైనాలోని ఓ రెస్టారెంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్తో పేలుడు సంభవించడంతో 31 మంది మరణించారు. వాయువ్య చైనాలోని యిన్చువాన్లోని బార్బెక్యూ రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. చైనాలో ప్రస్తుతం డ్రాగన్ డే ఫెస్టివల్ నేపథ్యంలో.. ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో చైనాలో చాలా మంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు బార్బెక్యూ రెస్టారెంట్ను సందర్శించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించినట్టుగా స్థానిక అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక, ఈ ప్రమాదంలో కనీసం 31 మంది మరణించగా.. మరో ఏడుగురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పేలుడు నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక, రెస్క్యూ సేవలకు చెందిన 100 మందిని, 20 వాహనాలను సంఘటనా స్థలానికి పంపినట్లు అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక అధికారులను వెంటనే... అన్ని రకాల శోధన, రెస్క్యూ ప్రయత్నాలను నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని పేర్కొంది. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించడం జరిగిందని తెలిపింది. ఇక, గురువారం తెల్లవారుజామున 4 గంటలకు సహాయక చర్యలు ముగిశాయని పేర్కొంది.
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ స్పందిస్తూ గాయపడిన వారికి చికిత్స అందించడంలో అన్ని విధాలుగా కృషి చేయాలని పేర్కొన్నట్టుగా స్టేట్ బ్రాడ్కాస్టర్ సీసీటీవీ పేర్కొంది. ప్రజల జీవితాలు, ఆస్తులను సమర్థవంతంగా రక్షించడానికి కీలకమైన పరిశ్రమలు, రంగాలలో భద్రతా పర్యవేక్షణ, నిర్వహణను బలోపేతం చేయాలని సూచించారని తెలిపింది.
