ఖైదీల తలలను తల్వార్లతో నరికి మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా.. 10 రోజుల్లో 12 మందికి మరణ శిక్ష!
సౌదీ అరేబియాలో మరణ శిక్షల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. తాజాగా, గడిచిన 10 రోజుల్లో 12 మందికి మరణ శిక్ష అమలు జరిపినట్టు టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఇందులో కొందరు ఖైదీల తలలను తల్వార్లతో నరికి చంపేసినట్టు వివరించింది.
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా మళ్లీ మరణ శిక్షల సంఖ్యను పెంచుతున్నట్టు తెలుస్తున్నది. గడిచిన 10 రోజుల్లోనే 12 మందికి మరణ శిక్ష అమలు చేసినట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. డ్రగ్స్ సంబంధిత నేరాల్లో 12 మందికి ఈ శిక్ష వేసినట్టు పేర్కొంది. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ 12 మందిలో కొందరిని తల్వార్తో ఖైదీల తలలను నరికి మరణ శిక్ష అమలు చేసినట్టు ఆ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది.
డ్రగ్స్ సంబంధ అభియోగాల కింద 12 మందిని నిర్బంధించారు. వారికి మరణ శిక్ష వేశారు. మరణ శిక్ష అమలు చేసిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీయులు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డానియన్లు, ముగ్గురు సౌదీలు ఉన్నట్టు టెలిగ్రాఫ్ పత్రిక రిపోర్ట్ చేసింది.
ఈ ఏడాది మార్చి నెలలో సౌదీ అరేబియా 81 మందిని పలు నేరాల కింద దోషిగా తేల్చి మరణ శిక్ష అమలు చేసింది. ఇందులో కొందరు ఉగ్రవాదుల గ్రూపులతోనూ సంబంధం ఉన్నవారని తెలిసింది. ఇంతమందిని చంపేయడం ఆధునిక సౌదీ అరేబియా చరిత్రలో ఇదే తొలిసారి.
Also Read: ఇరాన్లో పెరుగుతున్న మరణ శిక్షలు.. ఒక్క రోజులో ముగ్గురు మహిళలకు ఉరి.. వారు చేసిన నేరం ఏంటంటే?
ఈ మరణాల సంఖ్య ఇటీవలి కాలంలో మళ్లి పెరుగుతున్నది. ఇలాంటి శిక్షలను తగ్గిస్తామని సౌదీ అరేబియా చెప్పిన రెండేళ్ల తర్వాత ఈ సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. ముఖ్యంగా 2018లో టర్కీలో యూఎస్ జర్నలిస్టు జమాల్ కషోగి హత్య తర్వాత మరణ శిక్షల సంఖ్య సౌదీ అరేబియా హెచ్చుతున్నది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే సౌదీ డెత్ స్క్వాడ్ జమాల్ కషోగీని హతమార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.