Russia Ukraine War: జెలెన్స్కీ సంచలన నిర్ణయం.. భారత్ తోసహా ఐదు దేశాల రాయబారుల తొలగింపు
Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్తో సహా ఐదు దేశాల్లోని తన రాయబారులను ఆయన తొలగించారు. అధికార ప్రకటన ప్రకారం.. జర్మనీ, భారత్, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీలలో ఉక్రెయిన్ రాయబారులను తొలగించాడు.
Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ తో సహా ఐదు దేశాల్లో తన రాయబారులను తొలగించారు. అధికార ప్రకటన ప్రకారం.. జర్మనీ, భారత్, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీలలో ఉక్రెయిన్ రాయబారులను తొలగించాడు. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారో లేదో అనే స్పష్టత ఇంకా ఇవ్వలేదు. అలాగే.. ఈ చర్యకు ఎటువంటి కారణం కూడా తెలపలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడి వెబ్సైట్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జర్మనీలోని ఉక్రెయిన్ రాయబారి ఆండ్రీ మెల్నిక్ను తొలగించారు. ఈ ఉత్తర్వు ఉక్రెయిన్ అధ్యక్షుడి వెబ్సైట్లో జూలై 9న ప్రచురించబడింది. అదే సమయంలో.. హంగరీ, చెక్ రిపబ్లిక్, నార్వే, భారతదేశానికి చెందిన ఉక్రెయిన్ రాయబారులను తొలగించినట్టు ప్రచురితమైంది. ఇందులో ఉక్రెయిన్కు అంతర్జాతీయ మద్దతు, సైనిక సహాయాన్ని సమీకరించాలని జెలెన్స్కీ తన దౌత్యవేత్తలను కోరారు. ఫిబ్రవరి 24 నుంచి రష్యా దండయాత్రను ఆపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని తెలిపారు.
టర్బైన్లపై జర్మనీ-ఉక్రెయిన్ ప్రతిష్టంభన
జర్మనీ- ఉక్రెయిన్ మధ్య చాలా సున్నితమైన సంబంధాలున్నాయి. జర్మనీ రష్యా ఇంధన సరఫరాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. కెనడాలో మెయింటెనెన్స్లో ఉన్న జర్మనీ తయారీ టర్బైన్పై ప్రస్తుతం.. ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
రష్యా సహజ వాయువు దిగ్గజం గాజ్ప్రోమ్కు కెనడా టర్బైన్లను సరఫరా చేయాలని జర్మనీ కోరుతోంది. అదే సమయంలో, టర్బైన్లను సరఫరా చేయవద్దని ఉక్రెయిన్ కెనడాను కోరింది. రష్యాకు ఇస్తే.. దానిపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్లేనని కూడా పేర్కొంది.
అటువంటి పరిస్థితిలో.. జర్మనీలోని ఉక్రెయిన్ రాయబారి ఆండ్రీ మెల్నిక్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తొలగించడం కీలక పరిణామంగా పరిగణించబడుతుంది. ఆండ్రీ మెల్నిక్ .. జర్మనీ రాయబారిగా.. 2014 చివరలో నియమించబడ్డారు. ఆయన అప్పటి నుంచి జర్మనీలోని రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలలో సత్సంబంధాలను కలిగి ఉన్నాడు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా ఆక్రమిత ఖేర్సన్ ఒబ్లాస్ట్ గవర్నర్ హెన్నాడీ లహుటాను కూడా తొలగించారు. సర్వెంట్ ఆఫ్ పీపుల్ పార్టీ నుండి ఖేర్సన్ ఒబ్లాస్ట్ శాసనసభ సభ్యుడు డిమిత్రి బుట్రీని అధ్యక్షుడు వోలోడిమిర్ తాత్కాలిక గవర్నర్గా నియమించారు.
మారియుపోల్లో పేలుళ్లు, ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే.. జూలై 9న అజోవ్స్టాల్ స్టీల్ ప్లాంట్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించినట్లు మారియుపోల్ మేయర్ సహాయకుడు పెట్రో ఆండ్రిష్చెంకో తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత తమ విధులను నిర్వర్తించకుండా డిప్యూటీలు దేశం విడిచిపెట్టిన అంశంపై దర్యాప్తు చేయడానికి తాత్కాలిక దర్యాప్తు కమిషన్ను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ చెప్పారు.
రష్యా నుండి మైకోలైవ్పై క్షిపణుల దాడి
మైకోలైవ్ మేయర్ అలెగ్జాండర్ సెంకెవిచ్ ప్రకారం.. రష్యా సైన్యం శనివారం ఉదయం మైకోలైవ్పై ఆరు క్షిపణులను ప్రయోగించింది. ఈ రష్యా దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.