ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా దాడి చేస్తోంది. అయితే ఈ దాడిని తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. పౌరుల తరలింపునకు వీలుగా మంగళవారం ఉదయం నుంచి ఈ కాల్పుల విరమణ అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది.
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడి కొనసాగిస్తోంది. పుతిన్ సైన్యానికి జెలెన్ స్కీ (zelensky) సేనలు ధీటుగా బదులిస్తున్నాయి. అయితే ఈ రెండు సైన్యాల మధ్య భీకర దాడిలో తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. ఎక్కడ చూసినా బాంబుల మోతలు వినిపిస్తున్నాయి. కొంత కాలం వరకు ఆహ్లాదంగా ఉన్న ఆ ఉక్రెయిన్ నగరాలు ఇప్పుడు శ్మశానంలా కనిపిస్తున్నాయి. భవనాలన్నీ బాంబుల దాటికి దెబ్బతింటున్నాయి.
ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడి చేస్తుడంటంతో ఆ దేశ పౌరులు, వివిధ దేశాలకు చెందిన పౌరులు అక్కడే చిక్కుకుపోయారు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఆహారం, నీరు, నిద్ర లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకీడిస్తున్నారు. ఇండియాతో పాటు పలు దేశాలు తమ పౌరులను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల బాంబుల వర్షం కురుస్తుండటంతో ఈ తరలింపునకు ఆటంకం ఏర్పడింది. ఇటీవల ఈ బాంబుల వల్ల ఇండియాకు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు, అమాయకులైన ఆ దేశ పౌరులు ఈ దాడిలో చనిపోతున్నారు.
పౌరుల ప్రాణాలకు ఎలాంటి హానీ కలిగించకుండా ఉంచేందుకు రష్యా కాల్పుల విరమణ ప్రణాళికను ప్రకటించింది. ఈ సమయంలో ఆయా దేశాల పౌరులు, ఉక్రెయిన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. మాస్కో కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు కాల్పుల విరమణను నిర్వహిస్తుంది. ఉక్రెయిన్లోని కలహాలతో దెబ్బతిన్న నగరాలైన కీవ్, చెర్నిగోవ్, సుమీ మరియు మారిపోల్ నుండి పౌరులను తరలించడానికి మానవతా కారిడార్లను తెరుస్తుందని మాస్కో యూఎన్ రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. తరలింపు ప్రణాళిక ఉక్రెయిన్ ఆమోదానికి లోబడి ఉంటుందని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి మంగళవారంతో 13వ రోజుకు చేరుకుంది. తూర్పు ఐరోపా దేశంలో మానవతా సంక్షోభంపై సోమవారం జరిగిన UN భద్రతా మండలి సమావేశం ముగింపులో నెబెంజియా ఈ విషయాన్ని ప్రకటించారు. బెలారస్ వేదికగా సోమవారం రష్యాకు, ఉక్రెయిన్ కు మధ్య మూడో రౌండ్ శాంతి చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఇవి విఫలమయ్యాయి. ఈ చర్చల్లోరాజకీయ, సైనిక అంశాలపై సుధీర్ఘ చర్చలు కొనసాగాయి. కాగా ఇరు దేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో చర్చలు అసంపూర్ణంగా నిలిచాయి. ఎలాంటి సానుకూల అంశాలు లేవనే సంకేతాలిచ్చారు. దాడులు ఆగవని తెలిపారు.
ఈ చర్చల్లో పౌరుల తరలింపు సమస్య ప్రస్తావనకు వచ్చింది. దీంతో మానవతా కారిడార్లు మంగళవారం నుంచి ప్రారంభిస్తామని ఉక్రెయిన్ కు రష్యా హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోమవారం ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి మైఖైలో పోడోలియాక్ తెలియజేశారు. మానవతా కారిడార్ల లాజిస్టిక్స్ను మెరుగుపరిచే విషయంలో కొంత సానుకూల పురోగతి ఉందని పోడోలియాక్ చర్చల తర్వాత ట్వీట్ చేశారు. రష్యా ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో దాదాపు 1.7 మిలియన్ల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి పారిపోయారని UN శరణార్థి ఏజెన్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 24న రష్యా పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి 1,735,068 మంది ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోయారని తెలిపింది.
