ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా తీరును నిరసిస్తూ రష్యాలో పౌరులు ఆందోళనలు చేపట్టారు. ఆదివారం చేపట్టిన నిరసనల్లో పోలీసులు దాదాపు రెండు వేల మందికి పైగా అరెస్టు చేశారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 5,500 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం చేయ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. శ‌నివారం జ‌రిగిన యూఎన్ భ‌ద్ర‌తా స‌మావేశంలోనే ఈ విష‌యం తేట‌తెల్ల‌మైంది. ఈ స‌మావేశంలో దాదాపు 14 దేశాలు పాల్గొంటే.. ర‌ష్యా తీరుకు వ్య‌తిరేకంగా 11 దేశాలు ఓట్లు వేశాయి. అయితే మన దేశానికి రష్యాకు ఉన్న త‌త్సంబంధాల నేప‌థ్యంలో భార‌త్ తట‌స్థ వైఖ‌రిని అవ‌లంభించింది. అటు అనుకూలంగా గానీ, ఇటు వ్య‌త‌రేకంగా గానీ ఓటు వేయ‌కుండా ఓటింగ్ దూరంగానే ఉంది. ఇదే దారిలో చైనా, యూఏఈ కూడా నిలిచాయి. అయితే ఆ తీర్మాణం మెజారిటీతో ఆమోదం పొందినా.. ర‌ష్యా త‌న‌కు ఉన్న వీటో అధికారంతో దానిని తిర‌స్క‌రించింది. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేయ‌డాన్ని నాటో కూట‌మి కూడా మొద‌టి నుంచీ వ్య‌తిరేస్తోంది. నిజానికి త‌న వెన‌క నాటో ఉంద‌న్న న‌మ్మ‌కంతోనే ఉక్రెయిన్ ర‌ష్యాకు భ‌య‌ప‌డలేదు. ర‌ష్యా బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఉక్రెయిన్ వాటికి ధీటుగా స్పందించింది. కానీ ర‌ష్యా దాడి చేసే నాటికి ఎవ‌రూ ఆ దేశానిక స‌హాయం చేయ‌లేదు. కేవ‌లం మద్ద‌తుకు మాత్రమే ప‌రిమితం అయ్యారు. దీంతో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ తాము ఒంటి వారిమై పోయామ‌ని, త‌మ‌కు ప్ర‌పంచ దేశాలు ఏవీ స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా తాము పోరాటం ఆపబోమ‌ని స్ప‌ష్టం చేశారు. జెలెన్ స్కీ ప్ర‌క‌ట‌న త‌రువాత చాలా దేశాలు స్పందించాయి. ఆదివారం ప‌లు దేశాలు స‌హాయం చేస్తామ‌ని ముందుకొచ్చాయి. ఆయుధాలు, మందు గుండు సామాగ్రి పంపించాయి. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని విర‌మించాల‌ని చాలా దేశాలు కోరుతున్నాయి. దౌత్య మార్గాల ద్వారా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచిస్తున్నాయి. ఇందులో మ‌న దేశం కూడా ఒక‌టి. అయితే ర‌ష్యాలో చాలా మంది పౌరులు కూడా ఇదే కోర‌కుంటున్నారు. మొద‌టి నుంచి వారు యుద్దం చేయొద్ద‌నే కోరుతున్నారు. అయితే యుద్దం మొద‌ల‌వ‌డంతో వారంతా నిర‌స‌న‌ల బాట ప‌ట్టారు. ఆదివారం నాడు కూడా రష్యాలోని 48 నగరాల్లో యుద్ద వ్య‌తిరేక ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అయితే ఇలా నిర‌స‌న‌లు చేప‌ట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు 2,000 మందికి పైగా ర‌ష్యా పౌరుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. యుద్దం ప్రారంమైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,500 మందికి పైగా ప్రజలు ఇలా నిర్బంధానికి గుర‌య్యారు. 

మాస్కోలో ఆదివారం జ‌రిగిన నిర‌స‌న‌ల్లో కొందరు రష్యన్, ఉక్రేనియన్ భాషలలో శాంతి సంకేతాలు ప్ర‌ద‌ర్శించారు. యుద్ధ వ్యతిరేక నినాదాలతో చేతితో రాసిన ప్లకార్డులను ప‌ట్టుకున్నారు. ప‌లువురు ఇన‌ఫ్ అని రాసి ఉన్న మాస్కులు ధ‌రించారు. ఈ నిర‌స‌న క్ర‌మంలో ఇండిపెండెంట్ టెలివిజ‌న్ ఛానెల్ డోజ్ద్ రిపోర్టర్ ను కూడా అరెస్టు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ప్రెస్ అని రాసి ఉన్న చొక్కా చూపించినా, అలాగే తన అక్రిడిటేషన్‌ను పోలీసులకు చూపించినప్పటికీ వారు విన‌లేదు. 

డౌన్‌టౌన్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అప్‌మార్కెట్ గోస్టినీ డ్వోర్ డిపార్ట్‌మెంట్ స్టోర్ వెలుపల వందలాది మంది యుద్ధ వ్యతిరేక నిరసనకారులు నినాదాలు చేస్తూ ఒకచోట నిలబడ్డారు. ప్రతిపక్ష రాజకీయ నాయకుడు బోరిస్ నెమ్త్సోవ్ హత్య ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిరసనలు జరిగాయి. కాగా ఐరోపా అంతటా పదివేల మంది ప్రజలు ఆదివారం రష్యా దాడికి వ్యతిరేకంగా కవాతు నిర్వహించారు, బెర్లిన్‌లో ఉక్రెయిన్‌కు సంఘీభావంగా 100,000 మంది ప్రజలు నిరసన తెలిపారు.