తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ బానిస సంకెళ్లను తుంచేశారని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కితాబిచ్చారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగితే చివరకు సొంత సంస్కృతి నుంచి పరాధీనమై సాంస్కృతిక బానిసత్వానికి లోనవుతారని, ఈ ముప్పు నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు కాపాడారని వివరించారు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభపరిణామంగా అభివర్ణించారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ బానిస సంకెళ్లను తెంచారని ప్రశంసలు కురిపించారు. విద్యా బోధన ఆంగ్ల మాధ్యమంలో చేపట్టడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సొంత సంస్కృతిని వదిలి ఇతరుల సంస్కృతిని ఆచరిస్తే మానసికంగా మనం దానికి విధేయులగా మారిపోతాం. అది వాస్తవమైన బానిసత్వం కంటే హీనమైందని మనందరం గుర్తుపెట్టుకోవాలి. సాంస్కృతిక బానిసత్వం సంకెళ్లను తెంచేయడం చాలా కష్టం. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటి వరకు ఇదే జరిగింది. తాలిబన్లు ఇప్పుడు ఆ సంకెళ్లను తెంచేశారు’ అని కితాబిచ్చారు.

పాకిస్తాన్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్న డ్రాగన్ కంట్రీ కూడా తాలిబన్లతో దోస్తీ చేయడానికి పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. తాలిబన్లతో స్నేహాన్ని మరింత పెంచుకోవడానికి సంసిద్ధంగా చైనా వెల్లడించింది. రష్యా రాయబారి మంగళవారం తాలిబన్లతో భేటీ కానున్నారు. రష్యా విదేశాంగ మంత్రి జమీర్ కాబులోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దౌత్య వ్యవహరాల రక్షణ ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగుతుందని వివరించారు.

బుల్లెట్లు, బాంబులతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్‌లో పదిరోజుల్లోనే పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. తాలిబన్లు వేగంగా కాందహార్‌ను స్వాధీన పరుచుకోవడం కాబూల్‌ను వశపరుచుకుని అధికారాన్ని తమచేతుల్లోకి తీసుకోవడం రోజుల వ్యవధిలోనే ముగించింది. 20 ఏళ్ల పోరాటంలో తాలిబన్లే గెలిచారని దేశం వదిలిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు.