ఖలీస్తానీ సంస్థలకు చెంపపెట్టు: త్రివర్ణ పతాకంతో కెనడాలో సిక్కు సంస్థల ర్యాలీ
కెనడాలో భారత్లోని రైతు పోరాటానికి మద్దతుగా ఓ ఖలీస్తాన్ సంస్థ అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఈ ఖలీస్తాన్ మోసపూరిత చర్యలను ఎదుర్కోవడానికి సిక్కు సంఘం కెనడాలో ర్యాలీని నిర్వహించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతోంది. అనేక అంతర్జాతీయ మంది ప్రముఖులు, సంస్థలు రైతుల ఆందోళనకు మద్ధతు పలుకుతున్నారు.
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 41 రైతు సంస్థలు నిరసనలు చేస్తుండగా.. తాజాగా అనేక నిషేధిత సంస్థలు ఉద్యమంలోకి దిగాయి. మరీ ముఖ్యంగా ఖలీస్తానీ సిక్కు సంస్థ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిని చేపట్టినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సంస్థ ఆటకట్టించేందుకు సిక్కు గ్రూపులు నడుం బిగించాయి.
కెనడాలో భారత్లోని రైతు పోరాటానికి మద్దతుగా ఓ ఖలీస్తాన్ సంస్థ అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఈ ఖలీస్తాన్ మోసపూరిత చర్యలను ఎదుర్కోవడానికి సిక్కు సంఘం కెనడాలో ర్యాలీని నిర్వహించింది. వేలాది మంది సిక్కులు తమ వాహనాలలో త్రివర్ణ పతాకాన్ని చేతబూనీ ర్యాలీ చేపట్టారు.
సదరు ఖలీస్తాన్ సంస్థకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని.. భారతదేశం విడిపోవడానికి తాము అనుమతించమని సిక్కు గ్రూప్ తెలిపింది. కెనడాకు చెందిన సిక్కు సమాజంతో పాటు రైతులు ఆ సంస్థ మోసాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తమ నిరసన ఏ పార్టీకి చెందినది కాదని, కేవలం భారతదేశ ఐక్యత కోసం నిర్వహించినదని కెనడియన్ సిక్కు సంఘం స్పష్టం చేసింది.