మావోడు మంచోడు, బ్రెయిన్ వాష్ చేశారు: లాడెన్ తల్లి
అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడుల సూత్రధారి, అల్ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ చీఫ్ బిన్ లాడెన్ తల్లి అలియా ఘనేమ్ మొదటిసారి నోరు విప్పారు.
న్యూఢిల్లీ : అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడుల సూత్రధారి, అల్ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ చీఫ్ బిన్ లాడెన్ తల్లి అలియా ఘనేమ్ మొదటిసారి నోరు విప్పారు. సౌదీ అరేబియాలో అత్యంత విలాసవంతమైన భవనంలో ఉంటున్న ఆమెను ఆ దేశ ప్రభుత్వం అనుమతితో గార్డియన్ అనే ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేసింది.
తన కొడుకు బిన్ లాడెన్ మంచి తనయుడని ఆమె చెప్పారు. తన కొడుకుకి అతని 20 ఏళ్ల వయస్సులో ఛాందసవాదులు బ్రెయిన్ వాష్ చేశారని ఆమె అన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో అత్యంత పలుకుబడిగల కుటుంబాల్లో వారిది ఒక్కటి. ప్రస్తుతం ఘనేమ్ వయసు సుమారు 70 ఏళ్ళు.
లాడెన్ కు దాదాపు 20 ఏళ్ల వయసు ఉన్నపుడు కొందరు మత ఛాందసవాదులు పరిచయమయ్యారని, వారే తన కుమారుడికి బ్రెయిన్వాష్ చేశారని తెలిపారు. దానిని ఓ మత విధానం అని పిలవవచ్చునన్నారు. జెడ్డాలోని అబ్దులజీజ్ యూనివర్సిటీలో రాడికలైజ్ అయినట్లు తెలిపారు.
వాళ్ళకు దూరంగా ఉండాలని తాను చాలాసార్లు చెప్పానని అన్నారు. తనపై ఒసామాకు చాలా ప్రేమ ఉందని, అందువల్ల తాను ఏం చేస్తున్నదీ ఎప్పుడూ తనకు చెప్పేవాడు కాదని తెలిపారు.
ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడారు. తనకు పెద్ద సోదరుడైనందుకు ఒసామాను చూసి గర్విస్తానని ఒసామాకు వరుసకు సోదరుడైన అహ్మద్. కానీ ఓ మనిషిగా మాత్రం ఆయనను చూసి గర్వించబోనని చెప్పారు. ప్రపంచ వేదికపై లాడెన్ సూపర్ స్టార్ డమ్ కు చేరుకున్నాడని, అదంతా వ్యర్థం కోసమేనని అన్నారు.
ఒసామా చిన్న కొడుకు హంజా (29) అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరుపడ్డాడని అతని అంకుల్ హసన్ చెప్పారు. తండ్రి బాటలో నడవవద్దని హంజాకు చెబుతామని అన్నారు.