ఆస్ట్రేలియా తూర్పు తీరం పైన శుక్రవారం రాత్రి వేళ ఆకాశంలో ఒక రహస్యమైన ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది. నార్తర్న్ టెరిటరీ, క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్లలో ఈ వస్తువు దర్శనమిచ్చింది. ఇది చూపరులను ఆశ్చర్యపరిచింది.
ఆస్ట్రేలియా తూర్పు తీరం పైన శుక్రవారం రాత్రి వేళ ఆకాశంలో ఒక రహస్యమైన ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది. నార్తర్న్ టెరిటరీ, క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్లలో ఈ వస్తువు దర్శనమిచ్చింది. ఇది చూపరులను ఆశ్చర్యపరిచింది. అయితే తొలుత దానిని గ్రహాంతర మూలం అని కొంత ప్రచారం జరిగినప్పటికీ.. ఆ వస్తువు వాస్తవానికి భారతదేశం నుంచి ప్రయోగించబడిన రాకెట్ అని తర్వాత నిర్దారణ అయింది. పలువురు అనుభవజ్ఞులైన స్కై వాచర్లు.. అది గ్రహాంతర మూలం కాదని.. భారతదేశం చంద్రునిపైకి ప్రయోగించి చంద్రయాన్-3 అని వెల్లడించారు.
కొన్ని ఆస్ట్రేలియన్ ప్రదేశాలలో రాత్రి 7.25 గంటల (AEST కాలమానం) నుంచి పది నిమిషాల వరకు ఈ కాంతి కనిపించింది. ఒక నెటిజన్ టిక్టాక్లో ప్రకాశవంతమైన వస్తువు ఫుటేజీని పోస్ట్ చేయడంతో పాటు.. ‘‘యూఎఫ్వో వీక్షణ ... మనం భావించొచ్చా?’’ అని పేర్కొన్నారు. ఇక, భారత్ తన చంద్రయాన్-3 మిషన్ను విజయవంతం చేస్తే.. చంద్రునిపై నియంత్రిత ల్యాండింగ్ను అమలు చేసిన నాల్గవ దేశంగా అవతరిస్తుంది.

చంద్రయాన్ అంటే సంస్కృతంలో ‘‘చంద్రుని వాహనం’’ అని అర్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు (AEST కాలమానం ప్రకారం దాదాపు రాత్రి 7 గంటలు ) ఎల్వీఎం3-ఎం4 నింగిలోకి దూసుకెళ్లింది. అయితే అరగంట తరువాత ఆస్ట్రేలియన్లు ఆకాశంలో అంతరిక్ష నౌకను గుర్తించడం ప్రారంభించారు.
‘‘నేను దీనిని పెన్రిత్ సమీపంలోని వెస్ట్రన్ సిడ్నీలో (చూశాను). అది ఏమిటో గుర్తించడానికి (ఐదు నుంచి 10 నిమిషాలు) ప్రయత్నించాను’’ అని ఒక సిడ్నీ మహిళ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక, కాథరిన్, బుండాబెర్గ్, స్టాంథోర్ప్, సన్షైన్ కోస్ట్, యెప్పూన్, టౌన్స్విల్లే, వెస్ట్రన్ సిడ్నీ, కటూంబా, నార్తర్న్ టేబుల్ల్యాండ్స్లోని నివాసితుల నుంచి కూడా ఈ దృశ్యాలను వీక్షించినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే, చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించేందుకు భారతదేశంలో ప్రజలు టీవీలను, సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఇక, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం తర్వాత ట్విట్టర్లో చంద్రయాన్-3 ఖచ్చితమైన కక్ష్యలో ఉందని.. ‘‘చంద్రునిపైకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది’’ అని ధ్రువీకరించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ.. ‘‘భారత అంతరిక్ష సాహసోపేతమైన ప్రయాణంలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని స్క్రిప్ట్ చేసింది. ఇది ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతంగా ఎగురవేస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ ముఖ్యమైన విజయం మన శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనమని.. వారిని అభినందిస్తున్నట్టుగా చెప్పారు. ఇక, చంద్రయాన్ -3.. ఆగస్టు 23న చంద్రుడిపై దిగే అవకాశం ఉంది.
