పదేళ్ల బాలికపై 100మంది అత్యాచారం... గర్భం కూడా..
అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారి పట్ల ఐఎస్ ఉగ్రవాదులు కిరాతకంగా ప్రవర్తించారు. వందమందికి పైగా ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారి పట్ల ఐఎస్ ఉగ్రవాదులు కిరాతకంగా ప్రవర్తించారు. వందమందికి పైగా ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఒకరి కారణంగా చిన్నారి గర్భం దాల్చడం విషాదకరం. ఈ దారుణ సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. ఇరాక్ లోని ఐఎస్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన ఆ చిన్నారి మేనత్త చెప్పిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆ పదేళ్ల చిన్నారి మేనత్త తెలిపిన వివరాల ప్రకారం.. వారిది వారిది ఇరాక్లోని సింజార్ ప్రాంతం. వారు ఉంటున్న ప్రాంతంపై ఒక రోజు ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేశారు. కనిపించిన పురుషుడినల్లా కాల్చిచంపి, వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ ఎత్తుకెళ్లారు. తమ స్థావరాలకు చేరుకున్నాక.. అమ్మాయిలను వయసులవారీగా వారిని విభజించారు.
పదేళ్ల నుంచి ఇరవైఏళ్ల వరకూ వయసున్న అమ్మాయిలను పై స్థానాల్లో ఉన్న ఉగ్రవాదులు తీసేసుకున్నారు. వారిలో ఆ చిన్నారి కూడా ఒకరు. వారు తమకు తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని.. ఆకలిని తట్టుకోలేక జంతువుల పేడ వంటివి తిని ప్రాణాలు నిలుపుకొన్నామని బాలిక మేనత్త తెలిపింది.
అమ్మాయిలను వారు సెక్స్ బానిసల్లా చూసేవారని.. కోరిక తీరగానే జంతువులను అమ్మినట్టు వేరొకరికి అమ్మేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరిసారిగా తన స్నేహితురాలు తన మేనకోడలిని చూసేటప్పటికి ఆమె గర్భం దాల్చిందని ఆమె తెలిపింది. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సహాయంతో తాను ఆ నరక కూపం నుంచి బయటపడ్డానని.. తన మేన కోడలు మాత్రం ఎక్కడుందో, ఎలా ఉందో తెలియదని కన్నీటిపర్యంతమైంది.