రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న వైమానిక దాడులు మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తాజా ఘటనల్లో మాస్కో కేవలం మూడు రోజుల్లోనే 900కి పైగా డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్‌ మీద విరుచుకుపడిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ పరిస్థితులు చూస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు యుద్ధాన్ని ఆపాలనే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని మరిన్ని క్షిపణుల దాడులకు మాస్కో సిద్ధమవుతోందని నిఘా సంస్థలు హెచ్చరించాయని జెలెన్‌స్కీ తెలిపారు.

నిప్పుతో ఆటలు..

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.  రష్యా పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిప్పుతో ఆడుకునే విధంగా ఉన్నాయని, ఇలాగే కొనసాగితే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యలు రష్యాలో తీవ్రంగా చర్చకు దారి తీశాయి ఆ దేశ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి ఉపాధ్యక్షుడైన దిమిత్రి మెద్వెదెవ్, ట్రంప్ మాట్లాడిన తీరు సరికాదని మండిపడ్డారు. ప్రపంచానికి ప్రమాదకరమైన పరిణామం మూడో ప్రపంచ యుద్ధం మాత్రమేనని, అలాంటిది జరిగితే దానికి తీవ్ర ప్రభావాలుంటాయని ఆయన అన్నారు. పుతిన్‌పై చేసిన వ్యాఖ్యలను ట్రంప్ వెనక్కి తీసుకోవాలని సూచించారు.

ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ, అమెరికా, యూరోపియన్ దేశాలు మరింత కఠినంగా వ్యవహరించాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. మరింత ఆంక్షలు విధించి, రష్యా మిలిటరీ చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

మొత్తానికి, పుతిన్‌ తీసుకుంటున్న ఆగ్రహాత్మక వైఖరిపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు, మెద్వెదెవ్ స్పందన, ఉక్రెయిన్‌లో మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితులు — ఇవన్నీ కలిపి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే సూచనలుగా కనిపిస్తున్నాయి.