డిగో మారడోనా మృతిపై అనుమానాలు.. డాక్టర్ పై విచారణ..
ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా (60) మృతి విషయంలో ఆయన పర్సనల్ డాక్టర్ లియోపోల్డో ల్యూక్పై పోలీసులు విచారణ చేపట్టారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కారణంగానే డిగో మారడినా మరణించాడన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా (60) మృతి విషయంలో ఆయన పర్సనల్ డాక్టర్ లియోపోల్డో ల్యూక్పై పోలీసులు విచారణ చేపట్టారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కారణంగానే డిగో మారడినా మరణించాడన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫుట్ బాల్ గేమ్ లో ఆల్ టైం గ్రేట్ గా ప్రపంచచరిత్రలో నిలిచిపోయిన మారడోనా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి టిగ్రీలోని ఆయన నివాసంలోనే వ్యక్తిగత వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ క్రమంలో బుధవారం గుండెపోటుతో మారడోనా తుదిశ్వాస విడిచారు.
అయితే తమ తండ్రి ఆకస్మిక మరణం పట్ల మారడోనా కుమార్తెలు దల్మా, గియానినా, జనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ తరువాత ఆయన గుండె పనితీరుకు తగ్గట్టుగా చికిత్స జరగలేదని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారని పోలీసు వర్గాల సమాచారం.
దీనిమీద పోలీసులు మాట్లాడుతూ ‘‘దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులతో పాటు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడుతున్నాం. అయితే ఇందుకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ మారడోనా తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణ ధ్రువీకరణ పత్రంపై ఎవరి సంతకం లేదు. అలా అని దీనిని అనుమానాస్పద మృతిగా భావించలేం. విచారణ చేపట్టడం మా బాధ్యత’’ అని అధికారులు పేర్కొన్నారు.
కాగా ఈ విషయంపై స్పందించేందుకు ల్యూక్ నిరాకరించారు. ఇక మారడోనా పరిస్థితి విషమించిన తరుణంలో అంబులెన్స్కు ఫోన్ చేయగా, సుమారు గంటన్నర తర్వాత అక్కడికి చేరుకుందని, అత్యవసర పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక కారణాలేమిటో కనిపెట్టాలని మారడోనా న్యాయవాది మైటాస్ మోర్లా డిమాండ్ చేశారు.
అదే విధంగా మారడోనా మెడికల్ రికార్డ్స్, ఆయన ఇంటి సమీపంలో గల సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ఆ టాక్సికోలాజికల్ నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసును ముందుకు తీసుకువెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.