ఫిలిప్పీన్స్ లో భారీ వర్షాలు.. వరదలతో 17 మంది మృతి
Manila: జనవరి 1 నుండి ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడటం వంటి పరిస్థితులు కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా 500,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారని ఫిలిప్పీన్స్ ప్రభుత్వ విపత్తు ఏజెన్సీ శుక్రవారం తెలిపింది.
Philippines-Heavy rains: ఫిలిప్పీన్స్ ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదల సంభవించి ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రభావితమయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జనవరి 1 నుండి ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడటం వంటి పరిస్థితులు కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా 500,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారని ఫిలిప్పీన్స్ ప్రభుత్వ విపత్తు ఏజెన్సీ శుక్రవారం తెలిపింది.
"ఫిలిప్పీన్స్ లో జనవరి 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 17 మంది మృతి చెందారు. దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు" అని ప్రభుత్వ విపత్తు సంస్థ శుక్రవారం తెలిపింది. అల్పపీడన ప్రాంతాలు, ఈశాన్య రుతుపవనాలు, షియర్ లైన్ల సంయుక్త ప్రభావాల వల్ల ఐదు ప్రాంతాల్లో 17 మంది మరణించారని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఒక నివేదికలో తెలిపింది. గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రధానంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్ లోని 13 ప్రాంతాలను ప్రతికూల వాతావరణం ప్రభావితం చేసింది. క్రిస్మస్ వారాంతంలో ఈ ప్రాంతాలు వరదలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త సంవత్సరం తరువాత కూడా అక్కడ ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ విపత్తు కారణంగా 120 కి పైగా తరలింపు కేంద్రాల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన 70,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని ఏజెన్సీ తెలిపింది. దక్షిణ మిందానావో ప్రాంతంలోని ఒక ప్రాంతం, మధ్య ఫిలిప్పీన్స్ లోని నాలుగు ప్రాంతాలు విపత్తులో చిక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఫిలిప్పీన్స్ వాతావరణ బ్యూరో.. అల్పపీడన ప్రాంతం ఇప్పుడు సురిగావ్ డెల్ సుర్ ప్రావిన్స్కు తూర్పున 85 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బికోల్ ప్రాంతంతో పాటు మధ్య-దక్షిణ ఫిలిప్పీన్స్లో మరింత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
లూజాన్, విసాయాస్, మిందానావో దక్షిణ భాగంలో వారాంతంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతుందనీ, దీని ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. జనవరి 2 నుండి కాగయాన్ వ్యాలీ, సెంట్రల్ లూజాన్, కలబార్జోన్, మిమరోపా, బికోల్, పశ్చిమ విసాయాస్, తూర్పు విసాయాస్, జాంబోంగా ద్వీపకల్పం, ఉత్తర మిండానావో, దావో, సోక్స్సర్గెన్, బాంగ్సమోరోలో భారీ వర్షాల ప్రభావంలో ఏడుగురు గాయపడ్డారు. ఇద్దరు గల్లంతైనట్లు ఓసిడి నివేదించింది.
హినాటువాన్, సురిగావో డెల్ సుర్ కు తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం (ఎల్ పిఎ) షియర్ లైన్ తో కలిపి ఆల్బే, సోర్సోగాన్, మాస్బేట్, కాటాండువాన్స్, రోంబ్లాన్ లపై ప్రభావం చూపుతుందని ఫిలిప్పీన్స్ అట్మాస్ఫియరిక్, జియోఫిజికల్ అండ్ ఆస్ట్రోనామికల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (పిఎజిఎఎస్ఎ) వాతావరణ నిపుణుడు బెనిసన్ ఎస్టారెజా తెలిపినట్టు సీఎన్ఎన్ నివేదించింది. కామెరైన్స్ ప్రావిన్సులు, మిమరోపా, క్వెజాన్ ప్రావిన్స్ మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్పీఏ శుక్రవారం దాదాపు స్థిరంగా ఉంటుందని, ఆపై శనివారం నాటికి విసాయాస్, మిందానావో మధ్య ఎక్కడో కదులుతుందని భావిస్తున్నారు. మరుసటి రోజు ఇది బికోల్-విసాయాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుత వర్షాలు, వరదల కారణంగా 121,950 కుటుంబాలు ప్రభావితమయ్యాయనీ, ఇది 523,991 మందికి సమానమని తెలిపింది. వీరిలో 13,456 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. కాగా, వాతావరణ మార్పుల ప్రభావాలకు గురై అత్యంత హానికి గురయ్యే దేశాలలో ఫిలిప్పీన్స్ కూడా ఒకటి. దీనికి తోడూ ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీని కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల ప్రభావితమవుతున్నాయని పేర్కొంటున్నారు. మానవులతో పాటు ఆయా ప్రాంతాల్లోని అనేక జీవజాతులు మనుగడ కోసం ప్రకృతితో ఎన్నడూ చేయని పోరాటం సాగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.