చికెన్ బిర్యానీ ఆలస్యం అయిందని రెస్టారెంట్ తగలబెట్టాడు.. న్యూయార్క్ లో ఘటన..
చికెన్ బిర్యానీ కోసం ఓ వ్యక్తి ఏకంగా రెస్టారెంట్ నే తగలబెట్టేశాడు. తను ఆర్డర్ చేస్తే తొందరగా తేలేదని ఇంత దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యూయార్క్ లోని బంగ్లాదేశీ రెస్టారెంట్లో చోటు చేసుకుంది.
న్యూయార్క్ : ఒక్కోసారి క్షణికావేశంలో చేసే పనులు.. తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జీవితాలను మార్చేస్తాయి. నిందితులుగా జైల్లో పడేలా చేస్తాయి. అలాంటి ఘటనే న్యూయార్క్ లో వెలుగులోకి వచ్చింది. అది దేనికోసం అంటే బిర్యానీ కోసం.. కొన్నిసార్లు రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. వేరే వాళ్ళ ఫుడ్డు మనకు సర్వ్ చేయడం లేదా చాలా ఆలస్యంగా తీసుకురావడం.. ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఇవి మామూలుగా జరిగేవే.. అయితే వీటిని సీరియస్గా తీసుకున్నాడు ఓ కస్టమర్.
తను ఆర్డర్ చేసిన ఫుడ్ రాలేదని చిర్రెత్తుకొచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రెస్టారెంట్ కే నిప్పు పెట్టేసాడు. ఈ ఘటన న్యూయార్క్లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ లోని బంగ్లాదేశ్ రెస్టారెంట్ కి 48 ఏళ్ల చోఫెల్ నోర్బు అనే వ్యక్తి వచ్చి చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అయితే ఎందువల్లనో సిబ్బంది అతనికి సమయానికి తమ ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేశాడు.
యూకే వెళ్తే వారికి శుభవార్త.. కేవలం 15 రోజుల్లోనే వీసా..
ఆ తర్వాత ఒక రకమైన మండించే ద్రావణాన్ని బకెట్లో తీసుకువచ్చాడు. దాన్ని ఎవ్వరూ చూడడం లేదని నిర్థారించుకున్నాక ఆ రెస్టారెంట్ పార్కు గార్డెన్ లోకి పోశాడు. ఆ తరువాత నిప్పు పెట్టాడు. అయితే అది ద్రావణం కావడం.. బయటికి కూడా చాలానే పడడంతో అతడు పెట్టిన నిప్పు ఒక్కసారిగా ఎగజిమ్మి అతడికి కూడా మంటలు అంటుకున్నాయి.
అందుకు సంబంధించిన సంఘటన మొత్తం సిసి టివి ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. ప్రమాదం సంగతి గ్రహించిన రెస్టారెంట్ యాజమాన్యం మంటలన్ని ఆపి, పోలీసులకు సమాచారం అందించాడు. వీరు దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి.. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.