మలేషియాలో రోడ్డుపై ప్లేన్ క్రాష్.. ఫ్లైట్లోని వారు, వాహనదారులు దుర్మరణం.. ఆ భయానక వీడియోలు ఇవే
మలేషియాలో గురువారం రహదారి పైనే ప్లేన్ క్రాష్ అయింది. ఆ విమానంలోని ఎనిమిది మంది, రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూఢిల్లీ: మలేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా నేలకు చూసింది. వేగంగా వచ్చి భూమిని ఢీకొని బిగ్గరగా శబ్దం చేస్తూ పేలిపోయింది. రోడ్డుకు అతిసమీపంలోనే అది బద్ధలైంది. పేలిపోయిన క్షణాల్లోనే పెద్ద పెట్టున మంటలు, పొగ కొన్ని పదుల మీటర్ల ఎత్తుకు ఎగిసాయి. ఆ రోడ్డుపై వెళ్లుతున్న వాహనాలకు ఈ ప్రమాదం సెగలు తాకాయి. సరిగ్గా విమానం పేలిపోయినప్పుడు ఆ స్పాట్కు సమీపంగా ఒక బైక్, ఒక కారు ప్రయాణిస్తూ ఉండింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఎనిమిది మంది, రోడ్డుపై వెళ్లుతున్న ఇద్దరు వాహనదారులు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
మలేషియాలో రాజధాని నగరం కౌలలాంపూర్ పశ్చిమంలోని సెలంగోర్కు లాంగ్కావి నుంచి బీచ్క్రాఫ్ట్ మోడల్ 390 విమానం బయల్దేరింది. అప్పటి వరకు అంతా సజావుగానే సాగింది. ఫ్లైట్ ల్యాండింగ్కు కూడా క్లియరెన్స్ వచ్చేసింది. ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ కూడా ఫ్లైట్ నుంచి రాలేదు. కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. కొద్ది సమయంలోనే గురువారం ఆ ఫ్లైట్ క్రాష్ అయింది.
Also Read: భారత్లోని తిహార్ జైలులో భర్త.. పాకిస్తాన్ మంత్రిగా భార్య.. వీరిద్దరి ఆసక్తికర స్టోరీ ఇదే
ఈ క్రాష్కు సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ కారులోని రెండు క్యామ్లలో రికార్డ్ అయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అగ్గి మంటలు వాయురూపంలో ఆ రోడ్డును కమ్మేసినట్టు కనిపించాయి. ఆ కారు మంటల్లో నుంచి దూసుకుపోయింది.