అమెరికా సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబూల్ లోని హమీద్ కార్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్థరాత్రి బయలుదేరింది
ఆప్ఘనిస్తాన్ విషయంలో అమెరికా రక్షణ బలగాలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 20ఏళ్ల తర్వాత.. ఆప్ఘనిస్తాన్ ని.. అమెరికా సైనికులు పూర్తిగా వదిలేశాయి. అమెరికా సైనికులతో కూడిన చివరి విమానం ఆప్ఘనిస్తాన్ నుంచి సోమవారం అర్థరాత్రి బయలుదేరి వెళ్లింది. దీంతో ఆఫ్గాన్ గడ్డ నుంచి 20ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరగడం గమనార్హం.
ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అమెరికా సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబూల్ లోని హమీద్ కార్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్థరాత్రి బయలుదేరింది. దీంతో ఆప్ఘాన్ లో సైనికులు, పౌరుల తరలింపు పూర్తయ్యింది అంటూ యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ పెంటగాన్ లో ప్రకటించారు.
దీంతో అధ్యక్షుడు జోబైడెన్ విధించిన ఆగస్టు 31 గడుపు తేదీలోపు అమెరికా దళాలు ఆప్ఘాన్ ను ఖాళీ చేశాయి. అయితే గత వారం రోజుల నుంచి కాబూల్ లో చోటుచేసుకున్న బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలు దేరడం గమనార్హం.
మొదటి నుంచి ఇరు పక్షాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ ఆప్ఘాన్ నుంచి అమెరికా దళాలు, పౌరులను తరలించడంలో.. తాలిబన్లు చాలా సహకరించారని.. మెకంజీ చెప్పారరు. కాగా.. అమెరికా సైనికులు 20ఏళ్ల తర్వాత దేశాన్ని వదిలివెళ్లిపోడంతో.. తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు.
