కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే.. శాలరీ కట్..!
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తిని నిలువరించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కువైట్.. ఈ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కోరడా ఝలిపించేందుకు రెడీ అవుతోంది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా.. మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. మళ్లీ కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
దీనిలో భాగంగా విదేశీ ప్రయాణికుల రాకను రెండు వారాల పాటు నిలిపివేసింది. రేపటి(ఆదివారం) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తిని నిలువరించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కువైట్.. ఈ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కోరడా ఝలిపించేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆ దేశ సివిల్ సర్వీస్ కమిషన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వేతనాలు కట్ చేస్తామని హెచ్చరించింది. అత్యధికంగా 15 రోజుల సాలరీ కట్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. "ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్టపరమైన నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని ఆరోగ్య అధికారుల సూచనలను ఉద్యోగి తప్పక పాటించాలి." అని సివిల్ సర్వీస్ కమిషన్ ఈ సందర్భంగా పేర్కొంది. ఇదిలాఉంటే.. కువైట్లో విరుచుకుపడుతున్న మహమ్మారి ఇప్పటి వరకు 1,68,250 మందికి సోకగా.. ఇందులో 962 మందిని పొట్టనబెట్టుకుంది.