జర్మనీలోని హాంబర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి 12 మందిని గాయపరిచాడు. ఆరుగురి పరిస్థితి విషమం.

జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్‌లో కత్తి కలకలం చోటుచేసుకుంది. మే 24న చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ప్రయాణికులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అందులో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.రోజూ సగటున ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు చేసే హాంబర్గ్ రైల్వే స్టేషన్‌ అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటి. ఈ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం వద్ద నిల్చున్న ప్రయాణికులపై దుండగుడు ఆకస్మికంగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయంకర వాతావరణం ఏర్పడింది.

ఉగ్రవాద చర్యలతో…

దాడి అనంతరం అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ అధికారులు స్పందించి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ ఘటనకు ఉగ్రవాద చర్యలతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత కొన్ని నెలలుగా జర్మనీలో కత్తులతో దాడుల ఘటనలు పెరిగిపోతుండటంతో, ఈ దాడి కూడా అలాంటి సంఘటనల కోవలోకే వస్తుందా అని పోలీసులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దాడిలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొంతమందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఇకపోతే, హాంబర్గ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రజల భద్రత కోసం పోలీసులు స్టేషన్‌లో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్మనీ అంతటా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే అంశంపై కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు.