ఉత్తర కొరియాలోదారుణం: కరోనా వైరస్ సోకిందని వ్యక్తి హత్య
కరోనా వైరస్ సోకిందని ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరకొరియాలో చోటు చేసుకొంది.
ప్యాంగ్యాంగ్: చైనా నుండి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం కావడంతో అతడిని దారుణంగా హతమార్చింది ఉత్తరకొరియా ప్రభుత్వం. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని పాశవికంగా హత్య చేసింది.
చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్ జోంగ్ ఉన్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు.
అధికారులకు సహకరించాలని ఆదేశించారు. అదే విధంగా చైనాకు వెళ్లివచ్చిన తమ దేశ పౌరులు, అధికారులను నిర్బంధిస్తున్నారు. ఈ క్రమంలో నిర్బంధం నుంచి బయటకు వచ్చి బయట స్నానం చేసేందుకు ప్రయత్నించిన ఓ పేషెంట్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని కాల్చివేశారు.
ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన మీడియా ప్రకటించింది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదన్న విషయం అబద్ధమని ఇప్పటికే వైరస్ కారణంగా అక్కడ పలువురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని పేర్కొంది.