కాబూల్ లో ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న 160 ఆఫ్గాన్ సిక్కులు..!
నిన్న జరిగిన బాంబు దాడిలో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. తాము నిన్నటి వరకు ఉన్న ప్రాంతంలోనే ఈ బాంబు దాడి జరిగిందని వారు చెబుతున్నారు
ఆప్ఘనిస్తాన్ రాజధాని రక్తమోడుతోంది. ఉగ్రవాదులు చేసిన ఉగ్రదాడిలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 72 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 140 మంది తీవ్రగాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే.. ఈ బాంబు దాడి నుంచి 160 మంది సిక్కులు, హిందూ పౌరులు తృటిలో తప్పించుకున్నారు.
వీరంతా గురుద్వారాలో ఆశ్రయం పొందడంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ జంట పేలుళ్లు జరగడానికి కొద్ది గంటల ముందు వరకు దాదాపు 145 మంది ఆప్గన్ సిక్కులు, 15 మంది హిందువులు అక్కడే ఉన్నారు. గత వారం ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. వీరంతా.. దేశం విడిచిపెట్టారు. లేకపోతే.. ఈ బాంబు దాడిలో వీరు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
కాగా.. నిన్న జరిగిన బాంబు దాడిలో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. తాము నిన్నటి వరకు ఉన్న ప్రాంతంలోనే ఈ బాంబు దాడి జరిగిందని వారు చెబుతున్నారు. ఒక్కరోజు అక్కడ ఉన్నా.. తాము కూడా ప్రాణాలు కోల్పోయేవాళ్లమని వారు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. కాబూల్ ఎయిర్పోర్టు బయట జరిగిన దాడిపై తాలిబాన్లు స్పందించారు. అమెరికా కంట్రోల్లో ఉన్న ఏరియాలోనే ఘటన జరిగిందని ఆరోపించారు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. టెర్రర్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము భద్రతపై అత్యంత శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు.
కాగా.. ఈ ఉగ్రదాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు వారు ప్రకటన విడుదల చేశారు.