ముందు మాకు.. తర్వాతే ఎవరికైనా: కోవిడ్ టీకాపై తేల్చేసిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ విషయమై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందు అమెరికన్లు టీకా తీసుకోవడం పూర్తైన తర్వాత.. మిగిలితే ప్రపంచ దేశాలతో పంచుకుంటామని ఆయన తేల్చిచెప్పారు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ విషయమై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందు అమెరికన్లు టీకా తీసుకోవడం పూర్తైన తర్వాత.. మిగిలితే ప్రపంచ దేశాలతో పంచుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.
తమ దేశ అవసరాలకు మించి అదనంగా వ్యాక్సిన్ ఉత్పత్తి జరిగితే.. వాటిని అవసరమైన దేశాలకు పంపుతామని బైడెన్ స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం తమ వద్ద ఉన్న టీకా డోసులకు అదనంగా మరో 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేలా జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అధ్యక్షుడు గుర్తు చేశారు.
అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కొవ్యాక్స్ కార్యక్రమానికి 400 కోట్ల డాలర్లు కేటాయించినట్లు బైడెన్ తెలిపారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా అమెరికా వ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే విషయమని బైడెన్ పేర్కొన్నారు. అయితే, ఇంకా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగి పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కాగా, కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్డీపన ప్యాకేజీ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ బుధవారం ఆమోదముద్ర వేసింది.