జపాన్కు చెందిన ఓ దేశీయ విమానం 300 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. టోక్యో నుంచి ఫుకువోకాకు బయల్దేరిన విమానం ఏడు గంటల ప్రయాణం తర్వాత మళ్లీ మొదటికే వచ్చి చేరింది. సాంకేతిక కారణాలతో ఫ్లైట్ పెద్ద యూటర్న్ తీసుకుంది.
జపాన్కు చెందిన ఓ దేశీయ విమానం 300 మంది ప్రయాణికులకు చుక్కలు చూపించింది. అసలే విమానం లేటుగా టేకాఫ్ కావడంపై ఆగ్రహావేశాలు వెలువడ్డాయి. ఆ తర్వాత క్లిష్ట సమయంలో నిమిషాలను లెక్కిస్తూ ఆ ఫ్లైట్ను టేకాఫ్ చేశారు. సుమారు ఏడు గంటల పాటు ఆ విమానం ప్రయాణించింది. కానీ, పెద్ద యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేసింది. అందులో నుంచి దిగిన ప్రయాణికులు హమ్మయ్యా ప్రాణాలతో బయటపడ్డాం. ఫ్లైట్ క్రాష్ అయితే కాలేదు.. అనే ఆందోళనకర మన:స్థితితో బయట అడుగు పెట్టడం గమనార్హం.
జపాన్ ఎయిర్లైన్స్ కో ఫ్లైట్ జేఎల్331 టోక్యోలోని హనేడా ఎయిర్పోర్టు నుంచి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు (స్థానిక కాలమానం) బయల్దేరాల్సింది. రెండు గంటల ప్రయాణం తర్వాత ఆ ఫ్లైట్ ఫుకువోకాకు చేరుకోవాలి. కానీ, ఈ ఫ్లైట్ టేకాఫ్ 90 నిమిషాలు ఆలస్యమైంది. చివరి నిమిషంలో ప్లేన్ మార్చారు.
ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఫుకువోకా ఎయిర్పోర్టులో రాత్రి పది గంటల తర్వాత కమర్షియల్ ప్లేన్లకు అనుమతి లేదు. 6.30 గంటలకు హనేడా నుంచి బయల్దేరాల్సిన ఫ్లైట్ అప్పటికే 90 నిమిషాల ఆలస్యంతో 8 గంటలకు బయల్దేరింది. రెండు గంటల జర్నీ కావడంతో ఫుకువోకా సరిగ్గా రాత్రి 10 గంటలకు చేరుకునే అవకాశం ఉన్నది. ఫ్లైట్ అధికారులు ఈ ప్రయాణ సమయాన్ని లెక్క గట్టారు. రాత్రి 10 గంటలకు కేవలం నాలుగు నిమిషాల ముందు ఫుకువోకాలో ల్యాండ్ అవుతుందని గణించారు. కానీ, ఆ లెక్కలు వర్కవుట్ కాలేదు.
జేఎల్331 ఫుకువోకాకు చేరుతుండగానే పైలట్లకు విషయం అర్థమైపోయింది. ఫుకువోకాకు 10 గంటల్లోపు చేరలేకపోతున్నాం అనేది అవగతమైంది. ల్యాండింగ్ కోసం పంపిన రిక్వెస్ట్ను డినై చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ ఫ్లైట్ తిరిగి టోక్యోకు వెనుదిరగాల్సి వచ్చింది.
మొదట టోక్యో వరకు మళ్లీ సుదీర్ఘ ప్రయాణం చేయడానికి బదులు సమీప నగరం కితక్యూషుకు ఫ్లైట్ మళ్లించాలని అనుకున్నారు. కానీ, అక్కడ 335 ప్రయాణికులను హ్యాండిల్ చేయడానికి బస్సులు లేవు. దీంతో దాని గమ్యస్థానానికి 450 కిలోమీటర్ల దూరంలోని కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లాలని పైలట్లకు సూచనలు చేశారు. రాత్రి 11 గంటలకు ల్యాండ్ అయింది. కానీ, అక్కడ కూడా సరిపడా బస్సులు, బస వసతులు లేవు. దీంతో సోమవారం తెల్లవారుజామున మరోసారి టేకాఫ్ అయింది. ఈసారి టోక్యోకు వెళ్లిపోయింది.
ఓ ప్రయాణికుడు తన ఫ్లైట్ రూట్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ ఎయిర్లైన్ ప్రయాణికుల హోటల్స్, ట్యాక్సీలకు 20 వేల యెన్లను ఖర్చు పెట్టుకున్నదని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్లేన్ క్రాష్ కాలేదు.. అదే చాలు అంటూ ఓ ప్యాసింజర్ రాసుకున్నాడు.
