బియ్యం కొనలేదన్న జపాన్‌ వ్యవసాయ మంత్రిపైన విమర్శలు వెల్లువెత్తాయి. భార్య చీవాట్లు, ప్రజా ఆగ్రహం మధ్య చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు.

జపాన్‌లో తాజాగా జరిగిన ఓ ఫండ్‌రైజింగ్ ఈవెంట్‌లో వ్యవసాయ మంత్రి టకు ఎటో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాము ఇంట్లో బియ్యం కొనడం జరగదని, బహుమతులుగా దొరుకుతుండటంతో అవసరం ఏర్పడలేదని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు చెలరేగిన ఆహార ధరల నేపథ్యంలో ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బియ్యం ధరలు భారీగా పెరిగి

ప్రస్తుతం జపాన్‌ లో బియ్యం ధరలు భారీగా పెరిగి, ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో మంత్రి నోరు జారడం రాజకీయంగా పెద్ద విషయంగా మారింది. ఆయన మాటలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు నేరుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఫోన్‌లో మందలించింది..

ఈ పరిస్థితుల్లో మంత్రి టకు ఎటో సోమవారం మీడియా ముందుకు వచ్చారు. జనాలను ఆకట్టుకోవాలని అనడం లోపంగా మారిందని అంగీకరించారు. తన భార్య కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసి ఫోన్‌లో మందలించిందని తెలిపారు. ఇంట్లో ఇద్దరమే ఉన్నందున కావాల్సిన బియ్యం సరిపోతుందని చెప్పింది.ఇదిలా ఉండగా, జులై నెలలో జరగనున్న ఎగువసభ ఎన్నికల ముందు ఈ పరిణామాలు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా ఓపీనియన్ పోల్స్ ప్రకారం పార్టీకి మద్దతు కేవలం 27.4 శాతంగా ఉంది. పెరిగిన బియ్యం ధరలపై ప్రభుత్వ చర్యల పట్ల జనాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. దాదాపు 90 శాతం మంది ప్రజలు ఈ విషయంలో అధికారుల తీరుపై విరక్తిగా ఉన్నారు.

అలానే, గత ఏడాది తో పోల్చితే ప్రధాన ఆహారధాన్యాల ధరలు రెట్టింపయ్యాయి. దీనికి పంటల నష్టాలు, వేడి వాతావరణం, పెరిగిన పర్యాటక డిమాండ్ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర నిల్వల నుంచి బియ్యం విడుదల చేస్తోంది. కానీ మార్కెట్లో ధరలపై ఆ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం మరో ఆందోళనకారక అంశంగా మారింది.

 బియ్యం ధరల చుట్టూ రాజకీయ చర్చలు మరింత పెరుగుతుండటంతో, ఇటువంటి వ్యాఖ్యలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.