Japan Plane Crash: రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి
టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్ వేపై జపాన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఢీకొన్న కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురిలో ఐదుగురు మృతి చెందారు. అందులో కెప్టెన్ తప్పించుకోగా, మిగిలిన ఐదుగురి ఆచూకీ లభించలేదు. దీంతో వారు మృతి చెందినట్లు సమాచారం.
![Japan Plane Crash: Two planes collided. Five killed..ISR Japan Plane Crash: Two planes collided. Five killed..ISR](https://static-ai.asianetnews.com/images/01hk4rtwabtx64s045pqef9e5f/Screenshot-2024-01-02-151115-1704188539211_363x203xt.png)
Japan Plane Crash: టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో జపాన్ కోస్ట్ గార్డ్ విమానంలోని ఐదుగురు మరణించారు. అయితే మంటలు చెలరేగిన విమానంలోని 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని జపాన్ రవాణా మంత్రి టెట్సువో సైటో మీడియాతో తెలిపారని ‘ఎన్టీటీవీ’ పేర్కొంది.
సోమవారం సంభవించిన భారీ భూకంపం తర్వాత మధ్య జపాన్ కు బయలుదేరిన చిన్న విమానంలోని ఆరుగురు సిబ్బందిలో ఐదుగురు మరణించారని ఆయన చెప్పారు. కెప్టెన్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడని, అయితే ప్రమాదానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదన పేర్కొన్నారు.
జపాన్ ఎయిర్ లైన్స్ (జేఏఎల్) విమానం రన్ వేపై వెళ్తుండగా దాని చుట్టూ మంటలు అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందని వెంటనే డజన్ల కొద్దీ ఫైర్ ఇంజిన్లు ఫ్యూజ్లేజ్ ను స్ప్రే చేయడానికి ముందే విమానంలోని 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వేగంగా విమానం నుంచి బయటకు తీశారు.
అయితే రెక్కల దగ్గర కిటికీల నుంచి వస్తున్న మంటలను చల్లార్చడంలో వారు విఫలమయ్యారు. దీంతో మంటలు వెంటనే విమానం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఎయిర్ బస్ 350 విమానం ఉత్తర ద్వీపం హొక్కైడోలోని సపోరోకు సేవలందిస్తున్న న్యూ చిటోస్ విమానాశ్రయం నుంచి వచ్చింది. అందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు.
కాగా. ఈ ఘటన నేపథ్యంలో హనేడా అన్ని రన్ వేలను మూసివేసినట్లు విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. హనేడా జపాన్ లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. ఇక్కడ న్యూ ఇయర్ లీవ్స్ లో చాలా మంది ప్రజలు ప్రయాణాలకు సిద్ధపడుతారు. ఇదిలా ఉండగా.. 1985లో టోక్యో నుంచి ఒసాకా వెళ్తున్న జేఏఎల్ జంబో విమానం సెంట్రల్ గున్మా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో 520 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. ఆ విపత్తు ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.