దారుణం.. మైనర్ బాలికపై 30మంది అత్యాచారం
రిసార్ట్లో ఆమెను గదిలో నిర్బంధించి ఆమెపై ముప్పై మంది అత్యాచారం చేశారు. ఈ ఘటనతో కుంగిపోయిన ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని గతవారం పోలీసులకు చెప్పింది.
ఇజ్రాయిల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై దాదాపు 30మంది కామాంధులు దాడికి పాల్పడ్డారు. మైనర్ బాలిక అనే కనికరం కూడా లేకుండా 30మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈలాత్ నగరంలోని రెడ్ సీ రిసార్ట్ చూడటానికి వెళ్లిన పదహారేళ్ల బాలికపై మానవ మృగాల కన్ను పడింది. దీంతో అదే రిసార్ట్లో ఆమెను గదిలో నిర్బంధించి ఆమెపై ముప్పై మంది అత్యాచారం చేశారు. ఈ ఘటనతో కుంగిపోయిన ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని గతవారం పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వార్తతో దేశమంతా ఉలిక్కిపడగా, అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
క్రూరులను దారుణంగా శిక్షించాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇది షాకింగ్గా ఉందని, అసలు మాటలు రావడం లేదన్నారు. నిందితులపై విచారణకు ఆదేశించామన్నారు. "ఇది ఓ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం మాత్రమే కాదు, మానవత్వాన్ని వంచించి చేసిన నేరం. దీన్ని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంద"ని ఆ దేశ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ అన్నారు. ఇజ్రాయెల్లోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు అత్యాచారానికి గురవుతున్నారని 'మస్టికెరియాట్' మహిళా హక్కుల సంఘం కార్యకర్త ఇలానా వెజ్మాన్ తెలిపారు. అబ్బాయిలకు చిన్న తనం నుంచే ఈ విషయంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.