హిజబ్ వ్యతిరేక ఆందోళనలపై దిగొచ్చిన ఇరాన్ ప్రభుత్వం.. మొరాలిటీ పోలీసుకు ఫుల్స్టాప్
ఇరాన్లో మహిళలు ఉధృతంగా చేపట్టిన హిజబ్ వ్యతిరేక ఆందోళనలకు ఆ దేశ ప్రభుత్వం తలొగ్గింది. వారి డిమాండ్లపై దిగొచ్చి మొరాలిటీ పోలీసు వ్యవస్థకు ఫుల్స్టాప్ పెట్టబోతున్నట్టు అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మొంతజెరీ వివరించారు.
న్యూఢిల్లీ: హిజబ్ వ్యతిరేక ఆందోళనలతో సుమారు రెండు నెలలుగా ఇరాన్ పేరు అంతర్జాతీయ మీడియాలో మారుమోగిపోయింది. ఇరాన్ ప్రభుత్వం నిర్దేశించిన మహిళల డ్రెస్ కోడ్ను నిరసిస్తూ ఆ నిబంధనను ఉల్లంఘించిన మహ్సా అమిని మరణం తర్వాత ఆ దేశంలో హిజబ్ వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి. మొరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించింది. దీనిపై దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనలకు ఇరాన్ ప్రభుత్వం దిగొచ్చింది. మొరాలిటీ పోలీసు వ్యవస్థను ఇరాన్ ప్రభుత్వం తొలగించింది.
మహిళల సారథ్యంలో ఆందోళనలు ఇరాన్లో ఉధృతం అయ్యాయి. చాలా మంది మహిళలు హిజబ్ తొలగించి మహ్సా అమినీ మరణం నేపథ్యంలో ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జుట్టునూ కత్తిరిస్తూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహ్సా అమిని అంత్యక్రియలకు పెద్ద మొత్తంలో మహిళలు హాజరై ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీమ్ నేత పేరునూ పేర్కొంటూ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.
Also Read: మహ్సా అమిని మృతి : హిజాబ్ వ్యతిరేక నిరసనకారులపై పోలీసుల కాల్పులు.. ఎనిమిది మంది మృతి..
తాజాగా అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మొంతజెరీ ఈ అంశంపై మాట్లాడారు. మొరాలిటీ పోలీసుకు న్యాయవ్యవస్థతో సంబంధమే లేదని అన్నారు. మొరాలిటీ పోలీసు వ్యవస్థను తొలగిస్తున్నారా? ఎందుకు తొలగిస్తున్నారు? అంటూ కొందరు ఆయనను ప్రశ్నించారు. మతపరమైన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దానికి న్యాయవ్యవస్థతో సంబంధం లేదని తెలిపారు.
మహిళలు తమ ముఖాలను కవర్ చేసుకునే చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి పార్లమెంట్, న్యాయవ్యవస్థ రెండూ పని చేస్తున్నాయని మొంతజెరీ తెలిపారు. ఈ విషయం చెప్పిన తర్వాతి రోజే మొరాలిటీ పోలీసు వ్యవస్థకు ఫుల్స్టాప్ పెడుతామని వివరించారు.