రూ. 7.3 కోట్ల లాటరీ టికెట్ ను పారేసిన మహిళ.. కానీ...
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందనేది ఆమె విషయంలో నిజం కాలేదు. ఆమెను అదృష్టం దురదృష్టంలా వెన్నాడింది. అందుకే పారేసిన లాటరీ టికెట్ మళ్లీ ఆమె దగ్గరికే చేరి కోట్లు తెచ్చిపెట్టింది.
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందనేది ఆమె విషయంలో నిజం కాలేదు. ఆమెను అదృష్టం దురదృష్టంలా వెన్నాడింది. అందుకే పారేసిన లాటరీ టికెట్ మళ్లీ ఆమె దగ్గరికే చేరి కోట్లు తెచ్చిపెట్టింది.
ఆసక్తిగా ఉన్న ఈ కథనం గురించి తెలుసుకోవాలంటే మసాచుసెట్స్ కు వెళ్లాల్సిందే. అమెరికాలోని లీ రోజ్ అనే మహిళ లంచ్ కు వెళ్లాలనే తొందరలో తన లాటరీ టికెట్ ను సరిగా చూసుకోలేదు. లాటరీ తగలలేదని పెదవి విరిచి షాపులోనే ఓ మూల విసిరేసి వెళ్లిపోయింది.
అయితే పది రోజుల తరువాత షాపు క్లీన్ చేసేప్పుడు ఆ షాప్ ఓనర్ ఆ టికెట్ ను చూశాడు. దానికి లాటరీ వచ్చినా అలా పడేసి పోవడం చూసి ఆశ్చర్యపోయాడు. మసాచుసెట్స్ లో అభీ అనే భారత సంతతి వ్యక్తి లక్కీ స్టాప్ అనే లాటరీ టికెట్ల షాప్ ను నడుపుతున్నాడు.
లీ రోజ్ ఆ షాప్కు రెగ్యులర్ కస్టమర్. గత నెల మార్చిలో షాప్కు వెళ్లిన ఆమె ఎప్పట్లాగే టికెట్ కొంది. స్క్రాచ్ చేసింది. లంచ్ కు వెళ్లాల్సిన టైం కావడంతో.. లాటరీని సరిగా చూసుకోలేదు. ఎప్పట్లాగే తనకు లాటరీ తగలలేదని.. నిరాశ పడింది. టికెట్ను షాప్లో ఓ మూలన పారేసి వెళ్లిపోయింది.
ఆ టికెట్ 10రోజుల పాటు అక్కడే మిగతా టికెట్ల కుప్పలోనే ఉంది. ఆ ‘లక్కీ టికెట్’ను అభీ చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ టికెట్ విషయం ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనే దానిమీద రెండు రోజులపాటు అభీ కుటుంబం తీవ్రంగా చర్చించింది.
అభీ ఆ డబ్బుతో తనకోసం ఓ కారు కొనుక్కుందామనుకున్నారు. కానీ కుటుంబసభ్యలందరూ కస్టమర్ గెలిచిన సొమ్ము కస్టమర్ కే చెందాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో లీ రోజ్ కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. లీ రోజ్ మొదట ఈ విషయాన్ని నమ్మలేదు.
ఆ తరువాత షాప్ కు వచ్చి టికెట్ చూసుకుని ఎగిరి గంతేసింది. ఆనందంతో షాప్ నిర్వాహకులను కౌగిలించుకుంది. వారి నిజాయితీని అభినందిస్తూ లెక్కకుమిక్కిలి ఫోన్లు వస్తున్నాయి. ఇంటర్య్వూ కోసం పలు మీడియా సంస్థలు ఎగబడుతున్నాయి.