ఆస్ట్రేలియాలో మహిళను హత్య చేసి పరార్.. నాలుగేండ్ల తరువాత ఢిల్లీలో అరెస్ట్.. నిందితుడిపై ఐదు కోట్ల బహుమతి..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో 26 ఏళ్ల మహిళను హత్య చేసిన కేసులో నిందితుడైన భారతీయ నర్సును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతని గురించి.. ఏదైనా సమాచారం ఇస్తే మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో ఓ మహిళను హత్య చేసి.. భారత్ లో తలదాచుకుంటున్న హంతకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితుడిని పట్టిస్తే.. ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని ఆస్ట్రేలియా పోలీసులు గతంలో ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ లోని అమృత్సర్కు చెందిన రాజ్విందర్ సింగ్ .. ఆస్ట్రేలియాలో నర్స్గా పని చేసేవాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారితో కలసి అక్కడే ఉండేవాడు. అయితే.. 2018లో క్వీన్స్లాండ్లోని బీచ్లో తోయా కార్డింగ్లే (24 ఏళ్ల) మహిళను హత్య చేశాడు.
ఈ ఘటన అనంతరం రెండు రోజుల తర్వాత ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను విడిచి భారత్కు వచ్చేశాడు. భారత్ లో పలు ప్రాంతాల్లో ఉంటూ తల దాచుకుంటున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్వీన్స్ల్యాండ్ పోలీసులు రజ్విందర్ సింగ్ను నిందితుడిగా గుర్తించారు. అప్పటికే ఇండియా వచ్చి ఉండటంతో వారికి దొరకలేదు.
దీంతో క్వీన్స్లాండ్ పోలీసులు .. పంజాబ్లోని అమృత్సర్లోని బుటర్ కలాన్కు చెందిన రాజ్విందర్ సింగ్ గురించి ఏదైనా సమాచారం ఇస్తే ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (USD 633,000) బహుమతి ఇస్తామని ప్రకటించారు. అంటే.. మన కరెన్సీలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు. క్వీన్స్ల్యాండ్ పోలీసులు ఇంత మొత్తంలో బహుమతి ప్రకటించడం ఇదే మొదటిసారి.
"తోయా హత్యకు గురైన మరుసటి రోజు (అక్టోబర్ 22న) నిందితుడు సింగ్ కైర్న్స్ నుండి బయలుదేరి 23వ తేదీన సిడ్నీ నుండి భారతదేశానికి వెళ్లాడని మాకు తెలుసు. అతని రాకను భారత్ కూడా ధృవీకరించిందని క్వీన్స్లాండ్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. తాజాగా అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించారు.